నిజామాబాద్ క్రైం/బోధన్ రూరల్/ఆర్మూర్/ కామారెడ్డి, అక్టోబర్ 10: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీస్ అధికారులు తనిఖీల ను ముమ్మరం చేశారు. పలుచోట్ల నగదు పట్టుబడింది. జిల్లా కేంద్రంలో పట్టుబడిన నగదు వివరాలను అదనపు డీసీపీ జయరామ్, ఏసీపీ కిరణ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో రెండో టౌన్ ఎస్సై అశోక్ సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేయగా, ఓ వ్యక్తి వద్ద రూ.41 లక్షల 81 వేల నగదు లభించిందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో డబ్బులను సీజ్ చేసి ఇన్కం టాక్స్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.
సమావేశంలో సీఐ నరహరి, ఎస్సై అశోక్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం కంఠేశ్వర్ ప్రాంతంలో త్రీ టౌన్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. బోధన్ పట్టణంలో రూరల్ ఎస్సై నాగ్నాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఓ కారులో తరలిస్తున్న రూ. 5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సాలూరా చెక్పోస్ట్ వద్ద ఒకరు తరలిస్తున్న రూ. 60 వేలు పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.
ఆర్మూర్ పట్టణంలో ఎస్హెచ్వో సురేశ్బాబు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి సరైన ఆధారాలు లేకపోవడంతో రూ. లక్షా 22వేల 800 నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీఎస్పీ ప్రకాశ్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వాహనాలను తనిఖీలు చేయగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 4 లక్షల 7 వేలు, నిర్మల్కు చెందిన వ్యక్తి నుంచి లక్షా 13 వేలు స్వాధీనం చేసుకున్నారు. నగదును సీజ్ చేశామని దేవునిపల్లి ఎస్సై రాజు వెల్లడించారు.