బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్) కేంద్రానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. నవజాత శిశువులకు ముర్రుపాలు పట్టించడంతోపాటు మదర్ ఫీడింగ్ను ప్రోత్సహిస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మక బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ ఇనిషియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) అక్రిడేషన్ గ్రేడ్-1 గుర్తింపు దక్కింది. దేశంలోనే ఈ గౌరవం లభించిన ఏకైక ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ కొత్త రికార్డు సృష్టించింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో రాష్ట్రంలో ఏర్పాటైన తొలి మాతాశిశు సంరక్షణ కేంద్రం ఇదే. ఏడాదిన్నర క్రితం ఏర్పాటైన ఈ కేంద్రానికి గతంలో లక్ష్య అవార్డు రాగా, తాజాగా మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రభుత్వ వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో కార్పొరేట్ చికిత్సలు అందుతున్నాయి. ఇక, స్పీకర్ పోచారం కృషితో బాన్సువాడ దవాఖానల్లో వైద్య సేవలు బాగా విస్తృతమయ్యాయి. తాజాగా బీఎఫ్హెచ్ఐ అక్రిడేషన్ గ్రేడ్-1కు ఎంసీహెచ్ ఎంపిక కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానల పనితీరుకు ఈ అవార్డే గీటురాయి అని వారు పేర్కొన్నారు.
– బాన్సువాడ, ఫిబ్రవరి 17
బాన్సువాడ, ఫిబ్రవరి 17 : కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. తల్లి పాలను ప్రోత్సహించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇన్షియేటివ్ (బీఎఫ్హెచ్ఐ) అందించే బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్ల్లీ అక్రిడేషన్ గ్రేడ్-వన్ లభించింది. తద్వారా భారతదేశంలో ఈ ఘనత సాధించిన మొదటి ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డు సాధించింది. శిశువుల ఆరోగ్యం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) 10 ప్రమాణాలను నిర్దేశించింది.
దీంతో పాటు కేంద్ర ప్రభు త్వం మదర్స్ అబ్జల్యూట్ అఫెక్షన్ (ఎంఏఏ) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది.
ఈ ప్రమాణాలకు అనుగుణంగా బ్రెస్ట్ ఫీడింగ్ను ప్రోత్సహిస్తున్న దవాఖానలను యూనిసెఫ్, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా (బీపీఎన్ఐ), అసోసియేషన్ ఆఫ్ హెల్త్ ప్రొవైడర్స్ ఇండియా (ఏఎచ్పీఐ ) సంయుక్తంగా ఎంపిక చేసి బీఎఫ్హెచ్ఐ అక్రిడేషన్ ఇస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ మూ డేండ్ల పాటు అమలులో ఉంటుంది. బిడ్డ పుట్టిన అరగంటలోనే ముర్రుపాలు తాగించడంతోపాటు అరునెలల పాటు తల్లి పాలు మాత్రమే తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఐదేండ్ల లోపు పిల్లల మరణాలను 22 శాతం నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటి సారిగా వలంటరీ లాక్టేన్ వర్కర్స్ను నియమించింది. వీరు దవాఖానల్లో గర్భిణులు, బాలింతలకు తల్లి పాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రసవం అయిన అరగంటలోనే పిల్లలకు ముర్రు పాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్లో ముగ్గురు వలంటీర్లు ఉన్నారు. రెండు దఫాల పరిశీలన అనంతరం ఢిల్లీ నుంచి ఇటీవల వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్ను సందర్శించింది. అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించుకొని అక్రిడేషన్ మంజూరు చేసింది.