రెండు వందల ఏండ్ల పరాయి పాలనను, బానిస బతుకులకు చరమగీతం పాడిన ఎంతోమంది వీరుల పోరాట ఫలితమే భారతదేశ స్వాతంత్య్రం. స్వాతంత్య్ర మహాసంగ్రామంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాల మూలంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ, హైదరాబాద్, మహారాష్ట్ర, పర్బణి, నాందెడ్ తదితర ప్రాంతాల్లో మాత్రం నిజాం పాలనే కొనసాగేది. దేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్య్రం రాగా, తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 14వ తేదీనే అని పూర్వీకులు చెబుతున్నారు. రజాకార్ల పాలన అంతమైన తర్వాతే స్వతంత్ర భారతం ఆవిష్కృతమైనట్లు సమాచారం. రజాకార్ల పాలనను అంతం చేసేందుకు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడకు చెందిన ఎంతో మంది యోధులు పోరాటం చేశారు. అందులో బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన మాలే మహదేవ్, బోర్లం గ్రామానికి చెందిన కమ్మరి లింబయ్య ప్రముఖులు.
బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామానికి చెందిన కమ్మరి లింబయ్య, కోనాపూర్ గ్రామానికి చెందిన మాలే మహదేవ్తోపాటు పిట్లం, నిజామాబాద్, తదితర ప్రాంతాలకు చెందిన పలువురు స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. మహదేవ్ జహీరాబాద్ ప్రాంతంలోని రాయికోడ్ గ్రామానికి చెందిన వారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. రాయికోడ్లో ఉన్నరోజుల్లో రజాకార్ల ఆగడాలను ఓర్చుకోలేని ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన మహదేవ్.. వారికి ఎదురుతిరిగాడు. ఫలితంగా కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలో మూడేండ్లు జైలుజీవితం గడిపారు. స్వాతంత్య్ర ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మహదేవ్ స్వగ్రామంలోని ఇంటికి రజాకార్లు నిప్పంటించి, ఆస్తులను ధ్వంసం చేశారు. అనంతరం భార్య మాలే కిష్టమ్మతోపాటు పయనమై బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో తలదాచుకున్నట్లు వారి కుటుంబీకులు తెలిపారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన మహదేవ్కు 1972లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాగి ప్రశంసాపత్రాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అప్పటి గవర్నర్ రాంలాల్ చేతుల మీదుగా సత్కరించారని వారి కుటుంబీకులు తెలిపారు. ఉద్యమంలో పాల్గొన్న యోధులను గుర్తించిన అప్పటి ప్రభుత్వం మొదటగా రూ.200 పింఛన్ ప్రకటించారు. అప్పటి నుంచి మహదేవ్కు ప్రతినెలా పింఛన్ వచ్చేదని, మహదేవ్ మృతి చెందేవరకు రూ.500 పింఛన్ ఇచ్చారని తెలిపారు. మహదేవ్ 1985 ఫిబ్రవరి 7న మరణించాడు. అనంతరం భార్య మాలే కిష్టమ్మకు రూ.500 పింఛన్ అం దించడం ప్రారంభించగా, ఆమె మరణించే సమయానికి రూ.15వేల పింఛన్ ప్రభుత్వం అందజేసినట్లు కుమారు డు మాలె నాగేందర్ నమస్తే తెలంగాణతో తెలిపారు.
స్వాత్రంత్య సమరానికి ముందు నుంచి 1948వరకు జిల్లాల్లో రజాకార్ల వేధింపులు ముమ్మరంగా ఉండేవి. నిజాం నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలంగాణను పరిపాలిస్తుండే వాడు. ఈయన హయాంలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఆయన పాలనలోనే రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వి హిందువులను హింసించేవాడు. 1948 సెప్టెంబర్ 12న బీర్కూ ర్ మండల కేంద్రంలో రజాకార్లు ఒక వైశ్యుడిని సజీవదహనం చేసేందుకు యత్నించారు. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అరాచకాలను ఎదురించాలని ఓ యువకుడు అదే రోజు సాయంత్రం 50మంది యువకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ యువకుడిని బీర్కూర్ పెద్ద గయిని ముందు చేతులను కట్టేసి చితికబాదారు. 400మంది గ్రామస్తులు ఉన్నప్పటికీ 20మంది రజాకార్లను ఎదురించలేకపోయారు. అప్పుడు ఈ ప్రాం తాన్ని బానిసవాడగా పిలిచేవారట. బానిస సంకెళ్ల నుంచి బయటపడాలన్న దృఢసంకల్పంతో స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. అప్పటికే భారతదేశం లో రాష్ర్టాల విలీన ప్రక్రియ కొనసాగుతున్నది. నైజాం రజాకార్లు భారతదేశంలో విలీనం చేసేందుకు నిరాకరించడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశంతో భార త సైన్యాలు రజాకార్ల స్థావరాలను చుట్టుముట్టాయి. 1948 సెప్టెంబర్ 14 బాన్సువాడ చరిత్రలో మరుపురాని రోజుగా చెప్పవచ్చు. అప్పట్లో బాన్సువాడ తాలూకా కేంద్రంగా ఉండేది. దీనిని ఇండియన్ యూ నియన్ సైన్యాలు చుట్టుముట్టాయి. రజాకార్ల ఆచూకీ తెలపాలని స్థానికులను కోరాయి. బాన్సువాడలో 500మంది రజాకార్లను సైన్యం అరెస్టు చేసి డాక్ బంగ్లా (ఆర్అండ్బీ అతిథి గృహం)లో నిర్బంధిం చాయి. బాన్సువాడ తాలుకా పరిధిలోని దుర్కి, రాంపూర్ కుర్దూ మినహాయించి కోనాపూర్, బీర్కూర్ , బాన్సువాడ, పుల్కల్, జుక్కల్, మద్నూ ర్ ,గండివేట్ గ్రామాలను భారత సైన్యం ముట్టడించి రజాకార్లను అదుపులోకి తీసుకున్నాయి. రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రజలను జాగృతం చేసిన వారిలో బాన్సువాడకు చెందిన రంగరి విఠల్ రావు, బి గంగారెడ్డి, గురు రాములు, గురు నారాయణ, శ్రీనివాస్ రెడ్డి, కత్తెర శ్రీనివాస్, నాగ్నాథ్ ఉన్నట్లు పూర్వీకులు తెలిపారు. రజాకార్ల నుంచి విముక్తి పొందిన బానిసవాడ కాస్తా బాన్సువాడగా మారింది.