న్యూఢిల్లీ: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ జులై సెషన్కు (సెషన్-2) సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. సెషన్-2 స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు jeemain.nta.nic.in, ntaresults.nic.in వెబ్సైట్లలో స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెషన్-2 పరీక్షలను జులై 25 నుంచి 30 వరకు నిర్వహించింది. పేపర్-1, పేపర్-2కు సంబంధించిన ఫైనల్ కీని ఎన్టీఏ ఆదివారం ఉదయం విడుదల చేసిన విషయం తెలిసిందే.
జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది వంద పర్సంటైల్ సాధించారు. వారిలో తెలంగాణకు చెందిన ఐదుగురు ఉండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన శ్రెణిక్ మోహన్ మొదటి స్థానంలో నిలిచాడు. రాష్ట్రానికి చెందిన ధీరజ్ కురుకుంద స్టేట్ టాపర్గా నిలిచాడు.
జేఈఈ మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో రెండున్నర లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కాగా, జేఈఈ మెయిన్ జులై సెషన్లో తెలుగు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. పీ.రవిశంకర్ జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించగా, ఎం. హిమవంశీ 7వ ర్యాంకు, పల్లి జయలక్ష్మి 9వ ర్యాంకు సాధించారు.