చెన్నై: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఇవాళ తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఆ పోస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. నల్ల దుస్తులు ధరించిన యువన్.. తన పోస్టులో తానో డార్క్ ద్రవిడునని, తమిళుడైనందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆ పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఇటీవల తండ్రి ఇళయరాజా.. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ కామెంట్ చేసిన నేపథ్యంలో యువన్ శంకర్ పోస్టుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. అంబేద్కర్ అండ్ మోదీ.. రిఫార్మర్స్ ఐడియాస్, పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అన్న బుక్ను ఇళయరాజా రిలీజ్ చేశారు. ఆ సమయంలో మోదీని అంబేద్కర్తో ఇళయరాజా పోల్చారు. ద్రవిడ భావజాలంపై నమ్మకం ఉన్న వారు ఇళయరాజా కామెంట్లపై విమర్శలు చేశారు. బీజేపీ నేతలు ఇళయరాజాకు అండగా నిలిచారు.ఆయనేమీ తప్పుచేయలేదన్నారు. అయితే రాజ్యసభకు ఇళయరాజా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఇవాళ యువన్ శంకర్ రాజా పెట్టిన పోస్టు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నాయి. హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ యువన్ పోస్టు కూడా ఆసక్తి కలిగిస్తోంది. హిందీ భాష ఆధిపత్యాన్ని తమిళులు వ్యతిరేకిస్తున్న తీరులో యువన్ పోస్టు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల మరో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఓ వినూత్న పోస్టు చేసిన విషయం తెలిసిందే.