YS Jagan : గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల మంది అక్కాచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు వీరిలో చాలామంది ఉన్నారని, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3 వేల వరకు పెంచామని జగన్ తెలిపారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే మరింత మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున పోరాడుతామని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని అన్నారు.