గోదావరిలో మునిగిపోతున్న వారిని కాపాడిన యువకులు
కాళేశ్వరం, అక్టోబర్ 24: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి నదిలో ఆదివారం ప్రమాదవశాత్తు మునిగిన ముగ్గురిని అక్కడే ఉన్న యువకులు తమ ప్రాణాలకు తెగించి కాపాడారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన జెన్కో ఉద్యోగి తిరుపతి తమ బంధువులు ప్రియాంక, వినూత్నతో కలిసి కాళేశ్వరం దేవస్థానానికి వచ్చారు. ముందుగా త్రివేణి సంగమంలోని గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న క్రమంలో ఒక్కసారిగా నీటిలో మునిగిపోతుండగా అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు నాగుల శేఖర్, గణేశ్నాయక్ వెంటనే ఆ ముగ్గురిని ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. కొద్దిసేపటికి బాధితులు తేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఆ ముగ్గురి ప్రాణాలు కాపాడిన యువకులను భక్తులు, స్థానికులు అభినందించారు.