చేర్యాల, నవంబర్ 7: ఓ యువ రైతు వినూత్న ఆలోచన ఆయన పంటకు ప్రాణం పోసింది. పీజీ చదువుకొని వ్యవసాయం చేస్తున్న ఆయన తక్కువ సమయంలో పత్తి చేనుకు నీళ్లు ఎలా అందించాలో ఆలోచించాడు. ఇంతలోనే సరికొత్త ఆలోచన తట్టగా.. వెంటనే ఆచరణలో పెట్టాడు. అంతే ఆయన పత్తి చేను కాస్తా పచ్చబడటంతోపాటు అధిక దిగుబడులు ఇస్తున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మం డలం ఆకునూరుకు చెందిన యువ రైతు అనుముల సిద్ధ్దారెడ్డి 3 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తిసాగు చేశాడు. పంటకు సాగునీరు అందించాల్సి రావడం తో బోరు పెట్టి నీటిని చేనులోని కాల్వల ద్వారా చెట్టుచెట్టుకు మళ్లించడంతో సమయంతోపాటు నీళ్లు వృథా అవుతాయని గ్రహించాడు. వెంటనే స్ప్రింక్లర్ పైపులను తీసుకొచ్చి పత్తి చెట్ల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏర్పాటు చేసి పైపులను బోరు మోటర్కు అమర్చి మోటర్ ఆన్ చేశాడు.
దీంతో ఒక్కసారిగా నీళ్లు పత్తి చేనుపై వర్షం మాదిరిగా కురవడంతో ప్రతి చెట్టుకూ సమృద్ధిగా నీరు అందుతుండటంతో మొక్క కాస్తా బలంగా పెరగడంతోపాటు పత్తికాయలు సైతం ఎక్కువగా వచ్చాయి. కొన్ని రోజులుగా ఇదే పద్ధ్దతిన చేనుకు నీటిని అందజేస్తున్నాడు. తుంపర మాదిరిగా నీళ్లు పడుతుండటంతో పత్తి మొక్కల ఆకులపై ఉన్న చీడపీడలు కొట్టుకుపోవడంతోపాటు చెట్టు మొదలుకు సైతం నీరు అందుతున్నది. బోరుమోటర్ ద్వారా రోజులో ఎకరానికి నీరు పారితే.. స్ప్రింక్లర్ విధానంలో మూడు గంటల్లో ఎకరం పారుతున్నది. ఓవైపు సమయం, మరోవైపు కరెంటు, నీరు వృథా కాకుండా వ్యవసాయం చేస్తున్న సిద్ధ్దారెడ్డి ఆలోచన గొప్పదని పలువురు అభినందిస్తున్నారు.
నీరు వృథా కావొద్దనే..
పత్తి చేనుకు కాల్వల ద్వారా నీటిని అందిస్తే సమయంతోపాటు నీరు, కరెంటు వృథా అవుతున్నది. అదే స్ప్రింక్లర్ను అమర్చి నీటిని అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తుంపర మాదిరిగా నీళ్లు చేనుపై పడితే పత్తి పంటకు రోగం రాకుండా ఉంటుంది. ఓ వైపు ఖర్చు తప్పుతుంది. నాకైతే ఈ పద్ధతి ఎంతో బాగా నచ్చింది.