ముంబై: భారతదేశపు యువకుబేరుల్లో ఇప్పుడు నిఖిల్ కామత్ (34) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. దేశంలోని అతిపెద్ద బ్రోకరేజి సంస్థ జెరోధా వ్యవస్థాపకుడాయన.
నిజానికి ఆయన బడి చదువు కూడా పూర్తి చేయలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పుడు చదువు సరిగా అబ్బలేదు. స్కూలు తనను మెచ్చలేదు. తాను స్కూలును నచ్చలేదు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తరచూ బదిలీలు. బడులు మార్చడం వల్లనేమో చదువు అంతంతమాత్రంగానే సాగింది. తర్వాత మొత్తంగా ఆగింది. అలా ముగిసిన బడి చదువు తర్వాత 14వ యేట దోస్తుతో కలిసి పాత సెల్ ఫోన్ల వ్యాపారంమొదలుపెట్టాడు.
తల్లి తన చదువు మీది బెంగతో ఆ వ్యాపారాన్ని మాన్పించి ఫోన్లను మురికికాలువలో పోసింది. డిగ్రీ లేని తనకు ఉద్యోగం ఎవరిస్తారు? అందుకే చదువులతో సంబంధం లేని స్టాక్మా ర్కెట్ ట్రేడింగ్ లో కాలుమోపాడు. అదీ 17వ యేట. కాల్ సెంటర్ జాబ్ చేస్తూ చిన్నగా షేర్ల ట్రేడింగ్ మొదలుపెట్టారట. తర్వాత 18వ యేట తండ్రి ఇచ్చిన కొద్దిమొత్తం డబ్బుతో పద్ధతిగా ట్రేడింగ్చే యడం మొదలుపెట్టారు. తర్వాత అది ఊపందుకున్నది.
తండ్రి తనపై ఉంచిన నమ్మకం, కాల్ సెంటర్లో తోటి ఉద్యోగులు అందించిన ప్రోత్సాహంతో ఆ తర్వాత కొద్దికాలానికే కాల్ సెంటర్ జాబ్ మానేసి అన్న నితిన్ కామత్తో కలిసి జెరోధా కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీ విలువ రూ. మూడున్నర వేలకోట్లు. ట్రూబీకన్ అనే మరో కంపెనీకి కూడా కామత్ అధిపతి. తాను కోటీశ్వరుడినైనా తన పనితీరు మాత్రం మారదని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. ఐదేళ్ల తర్వాత ఆ పని చేస్తాను అంటే దానికి అప్పటికే కాలం తీరిపోయి ఉంటుందని కూడా ఆయన యువతకు సలహా ఇచ్చారు.