ప్రతిష్ఠాత్మక మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. మెగాటోర్నీలో నిలకడలేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా సెమీఫైనల్ బెర్తు కోసం తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటములు చవిచూసిన మిథాలీసేన మంగళవారం బంగ్లాదేశ్ను ఎదుర్కొనుంది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ బంగ్లాను చిత్తుచేయాలని చూస్తున్న భారత్ సెమీస్లో చోటుపై కన్నేసింది. మందన, మిథాలీ, హర్మన్ప్రీత్ రాణిస్తున్నా..సహచరుల వైఫల్యం జట్టును గెలుపు బాట పట్టించలేకపోతున్నది. మరోవైపు వరుస ఓటములతో కుదేలైన బంగ్లా..భారత్కు పోటీనివ్వాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగనుంది.
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓటములతో సెమీస్ అవకాశాలను ఒకింత సంక్లిష్టం చేసుకున్న టీమ్ఇండియా మిగిలిన రెండు మ్యాచ్ల్లో కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మంగళవారం బంగ్లాదేశ్తో మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత్ తలపడనుంది. మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘన విజయంతో అదిరిపోయే బోణీ కొట్టిన మిథాలీసేన..తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలయ్యారు. వెస్టిండీస్పై భారీ విజయంతో పోటీలోకి వచ్చినట్లు కనిపించిన మన అమ్మాయిలు ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో వరుస ఓటములు చవిచూశారు. దీంతో ఆడిన ఐదు మ్యాచ్ల్లో రెండు విజయాలు మూడు ఓటములు ఎదుర్కొన్న మిథాలీసేన ప్రస్తుతం నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. దీంతో బంగ్లాదేశ్పై ఎలాగైనా గెలిచి సెమీస్ పోరులో నిలువాలన్న పట్టుదలతో ఉన్న భారత్..సర్వశక్తులు ఒడ్డే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియా(10) సెమీస్లోకి ప్రవేశించిన నేపథ్యంలో మిగతా మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు తొలిసారి మెగాటోర్నీలో పోటీపడుతున్న బంగ్లా పడుతూ లేస్తూ సాగుతున్నది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతున్నది.
మెగాటోర్నీలో తొలిసారి పోటీపడుతున్న బంగ్లా…భారత్కు దీటైన పోటీనివ్వాలన్న పట్టుదలతో కనిపిస్తున్నది. పాకిస్థాన్పై ఏకైక విజయం సాధించిన బంగ్లా..విండీస్కు మంచి ఝలక్ ఇచ్చింది. తమదైన రోజైన ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తు చేసే సత్తా ఉన్న బంగ్లాను భారత్ తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. ‘గతంలో మేము పెద్దగా వన్డేలు ఆడింది లేదు. ప్రస్తుతం ఎఫ్టీపీ ద్వారా సిరీస్లు ఆడుతున్నాం. ప్రతి మ్యాచ్ను ఒక అవకాశంగా తీసుకుంటాం’ అని బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా అంది.
మెగాటోర్నీలో భారత్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడం లేదు. కచ్చితంగా గెలుస్తారనుకున్న మ్యాచ్లో మనోళ్లు చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంటున్నారు. దీనికి నిలకడలేమి టీమ్ఇండియాకు ఇబ్బందిగా మారింది. స్మృతి మందన, హర్మన్ప్రీత్కౌర్ ఫామ్లోకి వచ్చినా..మిగతా బ్యాటర్లు విఫలం కావడం ఓటములకు కారణాలు అవుతున్నాయి. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా..కాపాడుకోవడంలో విఫలమయ్యారు. బ్యాటర్లు రాణించిన చోట బౌలర్లు తేలిపోవడం మిథాలీసేనకు ప్రతిబంధకంగా మారింది. ఆసీస్తో గత మ్యాచ్లో ఆల్రౌండర్ దీప్తిశర్మను తప్పించి..షెఫాలీవర్మను తీసుకోవడం అంతగా లాభించలేదు. దీంతో టీమ్ మేనేజ్మెంట్ మళ్లీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉంటే కంగారూలతో మ్యాచ్లో కెప్టెన్ మిథాలీ టచ్లోకి రావడం ఒకింత సంతృప్తినిచ్చే అంశం. బంగ్లాతో మ్యాచ్లో షెఫాలీ స్థానంలో యస్తికా భాటియాను టాపార్డర్లో ఆడించే అవకాశముంది. బౌలింగ్ విషయానికొస్తే..వెటరన్ పేసర్ జులన్ గోస్వామి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నా..మేఘనసింగ్, పూజ వస్ర్తాకర్ నుంచి సరైన తోడ్పాటు లభించడం లేదు. ఈ యువ బౌలర్ల నిలకడలేమి భారత గెలుపు అవకాశాలను ప్రభావితం చేస్తున్నది. ‘ఓటముల గురించి అంతగా ఆలోచించడం లేదు. బంగ్లాతో మ్యాచ్లో రన్రేట్తో సంబంధం లేకుండా మ్యాచ్ గెలువడంపైనే దృష్టి పెడుతాం’ అని ఆల్రౌండర్ స్నేహ్రానా అంది.