మూడేళ్ల విరామం తర్వాత
విలక్షణ నటుడు మోహన్బాబు నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’.డైమండ్ రత్నబాబు దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకాలపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు మోహన్బాబు స్క్రీన్ప్లేను అందించడం విశేషం. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా ఆదివారం మోహన్బాబు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
ప్రస్తుతం మన వ్యవస్థలో ఎంతో మంది ఖైదీలు చేయని నేరాలకు శిక్షను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల కుట్ర వల్ల ఎందరో అమాయకులు చెరసాలల్లో మగ్గిపోతున్నారు. అలాంటి ఓ వ్యక్తి కథే ‘సన్ ఆఫ్ ఇండియా’. ఓ రాజకీయ నాయకుడి అక్రమాలపై పోరాడుతున్న అతనిపై అభియోగాలు మోపి జైలు శిక్ష పడేలా చేస్తారు. తనలా కారాగారవాసాన్ని గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారని తెలుసుకున్న అతను అభాగ్యులకు అండగా నిలుస్తాడు. ఆ ఖైదీల తరపున పోరాటానికి సంకల్పిస్తాడు. లక్ష్యసాధనలో చివరకు అతను విజయం సాధించాడా? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులేమిటన్నదే ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్ర కథ. దర్శకుడు డైమండ్ రత్నబాబు ఈ కథ చెప్పినప్పుడు అందులోని మానవీయ కోణాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. సామాజిక సందేశంతో పాటు యువతను మెప్పించే అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి.
ఓటీటీ కోసం అనుకున్నాం..
తొలుత ఓటీటీ కోసం ఈ సినిమా అనుకున్నాం. అందుకే తక్కువ నిడివితో తీశాం. ఆ తర్వాత కొన్ని సన్నివేశాల్ని జత చేసి థియేటర్ రిలీజ్కు సిద్ధమయ్యాం. ఈ సినిమా నిడివి రెండుగంటలు ఉంటుంది. నా పాత్ర చిత్రణ భిన్న పార్శాల్లో సాగుతుంది. సంభాషణలు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. నా దర్శకత్వంలో సినిమా చేయడానికి రెండు స్క్రిప్ట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నా. వాటిని ఎప్పుడు తెరకెక్కిస్తానో మాత్రం చెప్పలేను.
ఆత్మకథ రాస్తున్నా..
నా జీవితానుభవాలతో ఓ పుస్తకం రాస్తున్నా. అది దాదాపు పూర్తికావొచ్చింది. ఓ మామూలు పల్లెటూరు యువకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి యాభైఏళ్ల పాటు సాగిన నా సినీప్రస్థానాన్ని ఆత్మకథలో పొందుపరుస్తున్నా. అందులో నిజాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశా. నేను దైవాన్ని, విధిని బలంగా విశ్వసిస్తా. ఏ కార్యం మొదలుపెట్టినా ప్రయత్నంలోపం లేకుండా చూసుకుంటా. ఫలితాన్ని దైవానికే వదిలేస్తా. మన తలరాత ముందే నిర్ణయమైపోయి ఉంటుందని నమ్ముతాను. ఏది రాసిపెట్టుందో అదే జరుగుతుంది. తిరుపతిలో మా పాఠశాల ప్రాంగణం దగ్గర దివ్యమైన సాయిబాబా మందిరం నిర్మిస్తున్నా. నాలుగున్నర కోట్లతో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. మే నెలలో ఆ గుడిని ప్రారంభించబోతున్నాం.