Anand Mahindra | బెర్లిన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్ (World Archery Championships)లో సంచలనం నమోదైంది. మన దేశానికి చెందిన 17 ఏండ్ల యువ ఆర్చర్ అదితి స్వామి (Aditi Swami) వ్యక్తిగత స్వర్ణం నెగ్గి నయా చరిత్ర లిఖించింది. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు భారత్ తరఫున ఏ ఒక్కరూ వ్యక్తిగత స్వర్ణం దక్కించుకోలేకపోగా.. అదితి ఆ రికార్డును బద్దలు కొడుతూ.. మహిళల కాంపౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు భారత కాంపౌండ్ టీమ్ (Indian compound Team) పసిడి పతకంతో మెరిసింది. అయితే మహిళలు సాధించిన ఈ విజయాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. “యుద్ధభూమిలో ఆర్చర్స్తో ఇండియాకి ఇంకో బ్లాక్ బస్టర్ సినిమా రానుంది. ఈ సారి అమ్మాయిలను యోధులుగా.! వెల్డ్న్ అదితి“. అంటూ సోషల్ మీడియాలో రాసుకోచ్చారు.
The next blockbuster movie from India featuring archers on a battlefield BETTER have women as the warriors! Go Aditi! 👏🏽👏🏽👏🏽pic.twitter.com/0DI2jTlcaP
— anand mahindra (@anandmahindra) August 5, 2023
ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భాగంగా శనివారం జరిగిన తుదిపోరులో మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాపై అదితి విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తుది పోరులో 149-147 పాయింట్ల తేడాతో అండ్రియా బెకెరా (మెక్సికో)పై అదితి అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన జోరు ప్రదర్శించిన అదితి తొలి నాలుగు రౌండ్లలో ఏకంగా 12 సార్లు కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ పదేసి పాయింట్లను తన ఖాతాలో వేసుకుని అదితి భారత్కు పసిడి పతకాన్ని ఖాయం చేసి చరిత్ర లిఖించింది. ఇదే విభాగంలో పోటీపడ్డ జ్యోతి సురేఖ కాంస్య పతకం దక్కించుకుంది. పురుషుల విభాగంలో ఓజాస్ దియోతలె స్వర్ణం నెగ్గాడు. ఈ చాంపియన్షిప్లో భారత్ మొత్తం 4 మెడల్స్ (3 స్వర్ణాలు, ఒక కాంస్యం) గెలుచుకొని అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది.