ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో ఒత్తిడికి గురై ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. తదుపరి మ్యాచ్లో జూలు విదిల్చింది. బంగ్లాతో పోరులో మన అమ్మాయిలు సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటి అద్వితీయ విజయాన్నందుకున్నారు. సెమీఫైనల్ బెర్త్ దక్కాలంటే తప్పక నెగ్గాల్సిన పోరులో దంచికొట్టిన మిథాలీ బృందం.. మెగాటోర్నీలో మిగిలిన ఏకైక లీగ్ మ్యాచ్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. నాకౌట్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన కీలక పోరులో మిథాలీరాజ్ బృందం కలిసి కట్టుగా కదం తొక్కింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 110 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. ఎనిమిది జట్లు తలపడుతున్న మెగాటోర్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడి మూడు విజయాలు ఖాతాలో వేసుకున్న భారత్ 6 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నది. చివరి లీగ్ మ్యాచ్లో ఆదివారం దక్షిణాఫ్రికాతో మిథాలీ బృందం తలపడనుంది. బంగ్లాతో పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది.
యస్తిక భాటియా (50) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. షఫాలీ వర్మ (42; 6 ఫోర్లు, ఒక సిక్సర్), స్మృతి మందన (30), పూజ వస్ర్తాకర్ (30 నాటౌట్), స్నేహ్ రాణా (27), రిచా ఘోష్ (26) రాణించారు. బంగ్లా బౌలర్లలో రితు 3, నహిద రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లా 40.3 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. సల్మా ఖాతూన్ (32) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4, జులన్ గోస్వామి, పూజ వస్ర్తాకర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. యస్తిక భాటియాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సెమీస్ సమీకరణాలు..
లీగ్ దశలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లాడిన భారత్ 6 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్నది. రన్రేట్ (0.768) విషయంలో మెరుగ్గా ఉంది. ఆదివారం చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై మిథాలీ బృందం విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా నాకౌట్ బెర్త్ దక్కించుకోనుంది. ఒకవేళ ఓడినా అవకాశాలున్నాయి. బుధవారం జరుగనున్న లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే టీమ్ఇండియా సెమీస్ మార్గం సులువు కానుంది. ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ ఓడినా.. వెస్టిండీస్, న్యూజిలాండ్తో కలిసి ఆరు పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలువనుంది. పాయింట్లు సమమైతే మెరుగైన రన్రేట్ ఉన్న మిథాలీ టీమ్ ముందడుగు వేయనుంది.
జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. దేశవాళీల్లో మూడో స్థానంలో బరిలోకి దిగడం అలవాటు. అంతర్జాతీయ క్రికెట్లో నాకు ఇదే తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను
– యస్తిక, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 229/7 (యస్తిక 50, షఫాలీ 42; రితు మోనీ 3/37), బంగ్లాదేశ్: 40.3 ఓవర్లలో 119 ఆలౌట్ (సల్మ 32; స్నేహ్ రాణా 4/30, జులన్ గోస్వామి 2/19, పూజ 2/26).