ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. మాస్క్ ధరించాలన్న తప్పనిసరి నియమం కూడా అక్కడ ఉన్నది. కానీ శుక్రవారం ఓ మహిళ కాండివలీ రోడ్డు మార్గంలో మాస్క్ లేకుండా కనిపించింది. ఆ మహిళను స్థానిక మున్సిపల్ వర్కర్ అడ్డుకున్నది. మాస్క్ పెట్టుకోవాలంటూ కోరింది. ఆ సమయంలో మున్సిపల్ వర్కర్పై ఆ మహిళ ఆకస్మికంగా దాడి చేసింది. చెంప చెల్లు మనిపించింది. ఆటోలో నుంచి మహిళా మున్సిపల్ వర్కర్ను కాలితో తన్నింది. ఆ వర్కర్ పై భీకరంగా దాడి చేసింది. ఈ ఘటన మొత్తం మొబైల్ వీడియోలో చిత్రీకరించారు. మాస్క్ పెట్టుకోని మహిళను.. మున్సిపల్ వర్కర్ కూడా వదలలేదు. తనను కొడుతున్నా.. ఆ వర్కర్ మాత్రం మహిళను అలాగే గట్టిగా పట్టుకుంది. మాస్క్ లేకుండా తిరిగేవాళ్లకు ముంబైలో రూ.200 ఫైన్ వేస్తున్నారు. మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన మహిళకు ప్రభుత్వం ఎటువంటి శిక్ష విధిస్తుందో చూడాలి.