-సికింద్రాబాద్, నవంబర్ 16: దేశంలోనే అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డుగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్పై కేంద్ర ప్రభుత్వం శీతకన్ను వేస్తుంది. బోర్డు అభివృద్ధికి ఏ మాత్రం సహకరించకపోగా, మౌలిక వసతుల కల్పనకు మొడిచెయ్యి చూపిస్తుంది. మరోవైపు బోర్డుకు సర్వీస్ చార్జీల నిధులను విడుదల చేయకపోవడంతో అభివృద్ధిలో కూనరిల్లుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలటరీ స్థావరాలు, కార్యాలయాల నుంచి బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను గత కొన్నేండ్లుగా చెల్లించడం లేదు. సర్వీస్ చార్జీల రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి బోర్డుకు సుమారు రూ. 664కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. కనీసం వీటిలో రూ. 100కోట్లు అయినా చెల్లించాలని కేంద్రం ముందు గతంలో పాలకమండలి సభ్యులు పలుమార్లు విన్నవించినా కనీసం కరుణించకపోవడం గమనార్హం. బకాయిలు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం రూ. 99కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలని అడుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.
పదవుల కోసమే ఆరాటం
నిత్యం నిద్రలేచిన దగ్గరి నుంచి కేంద్ర ప్రభుత్వం అది చేస్తున్నది… ఇది చేస్తున్నది అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు బోర్డుకు కేంద్ర నుంచి రావాల్సిన నిధులపై నోరు ఎందుకు మెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎంతసేపటికి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే బీజేపీ నేతలు కేవలం పదవుల కోసమే ఆరాటపడ్డారే తప్ప బోర్డు అభివృద్ధిపై దృష్టి సారించడం లేదు. నిన్నామొన్నటి వరకు సివిలియన్ నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూసిన నేతలకు డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతకే నామినేటెడ్ ఇవ్వడంతో బీజేపీలో కలకలం రేగింది. కానీ నామినేటెడ్పై ఉత్కంఠగా లాబీయింగ్కు పాల్పడిన నేతలు కనీసం ఇక్కడి ప్రాంతంలో బకాయిలు పడ్డ నిధులను రప్పించడంలో మాత్రం చొరవ తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీ నాయకులకు పదవులపై ఉన్న మోహం, కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై లేకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.
రాష్ట్ర సర్కారు నిధులతోనే నెట్టుకొస్తున్న బోర్డు
బోర్డుకు కేంద్రం నుంచి నిధులు రాకపోయేసరికి కనీసం ఉద్యోగులకు జీతాలకు సైతం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ క్రమంలో బోర్డుకు రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సిన నిధులను దశల వారీగా విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తున్నది. కంటోన్మెంట్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ (టీపీటీ) నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా బోర్డుకు ఇప్పటికే మూడు దఫాల్లో విడుదల చేసింది. అదే విధంగా కేంద్రం ఇచ్చే 13,14,15వ ఆర్థిక సంఘం నిధుల్లో బోర్డుకు చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వం ఈ మధ్యనే బోర్డు ఖాతాలో జమచేశారు. జీఎస్టీ, వినోద పన్ను, వృత్తి పన్నులాంటి ఇతరాత్ర మార్గాల ద్వారా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం నాలుగైదు రోజుల్లో విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. బోర్డు ఆదాయానికి వేరే మార్గాలు లేవని ఇలాంటి గ్రాంట్లు, సర్వీస్ చార్జీల ద్వారానే మనుగడ సాగిస్తున్నదని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో సోమవారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో బోర్డు మాజీ సభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావును కలిసి పెండింగ్లో ఉన్న నిధులను బోర్డుకు విడుదల చేయాలని కోరడం జరిగింది. దీంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.