India Vs West Indies | ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. అయితే మొదటి టెస్టులో వెస్టిండీస్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ క్రైగ్ బ్రాత్వైట్ (Kraigg Brathwaite ) స్పందించారు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు ఓడిపోయిందని.. పిచ్ పూర్తిగా స్పినర్లకు అనుకూలించడంతో అశ్విన్ (Ashwin), జడేజా(Jadeja)ల బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టమైందని బ్రాత్వైట్ అన్నారు.
తొలి రోజు ఆటలో మెరుగైన ప్రదర్శన చేశాం. కానీ పేలవ బ్యాటింగ్తో నిలదొక్కుకోలేక మూల్యం చెల్లించుకున్నాం. నేను కూడా బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాను. తన కెరీర్లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న అలిక్ అథనాజె (28) అద్భుతంగా (Alick Athanaze) ఆడాడు. బౌలింగ్తో పాటు బ్యాట్తోనూ రాణించాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. ఈ మ్యాచ్కు వచ్చి మాకు మద్దతు తెలిపిన డొమినికా(Dominica) ప్రజలకు నా కృతజ్ఞతలని బ్రాత్వైట్ మీడియాతో చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత జట్టు ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (7/71) ధాటికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 130 పరుగులకే ఆలౌటైంది. అలిక్ అథనాజె (28) టాప్ స్కోరర్గా నిలిచాడు. జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. భారత స్పిన్నర్ల ధాటికి విండీస్ జట్టు.. స్కూల్ టీమ్ను తలపించింది. మనవాళ్లు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసిన చోట.. కరీబియన్లు కనీసం నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 421/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్(Yashaswi Jaiswal)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 20 నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.