బేగంపేట్ డిసెంబర్ 7: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద నున్న వెస్లీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు మంగళవారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. గౌరవ అతిథిగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా కళాశాల సావనీర్ మంత్రి చేతుల మీదుగా విడుదల చేశారు. దీంతో పాటు స్కూల్ పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, వెస్లీ కళాశాలలో విద్యను అభ్యసించిన వారు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని ఘడించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను యాభై ఎళ్లుగ అందిస్తూ ఎంతోగానో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న వెస్లీ కళాశాల కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధులకు సత్కారం, ప్రార్ధనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసీ సాల్మాన్ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ మోజెస్పాల్, ప్రతినిధులు సత్యానందం, అల్లాడి రవి కుమార్, వినోద్, బాసా కృపానందం, శివ కుమార్ పాల్గొన్నారు.