హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ప్రజల్లో అభద్రతాభావం పెరిగి అభివృద్ధి కూడా కుంటుపడుతుందని పేర్కొన్నారు. మన భవిష్యత్తు, భద్రత కోసం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులకు రుణపడి ఉన్నామని తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం గోషామహల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. పోలీస్ల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ, అత్యంత కీలకమైన శాంతిభద్రతల అంశానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారని, కొవిడ్ విధుల నిర్వహణలో గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 62 మంది తెలంగాణ పోలీసులు, 10 మంది హోంగార్డులు ప్రాణత్యాగం చేశారని చెప్పారు.
నేర రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ మహేందర్రెడ్డి
తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో పోలీస్శాఖ నిరంతరం కృషి చేస్తున్నదని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. నేరాల కట్టడి, కేసుల దర్యాప్తులో టెక్నాలజీని వాడటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8.22 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, అన్ని గ్రామాలు, పట్టణాల్లో కలిపి 15 లక్షల సీసీటీవీ కెమెరాలు అమర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారులు, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీలు జితేందర్, అభిలాషా బిస్త్, శిఖాగోయల్, ఐజీలు నాగిరెడ్డి, శివశంకర్రెడ్డిసహా పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొని అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు.