వెల్దుర్తి, నవంబర్ 17: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూ కబ్జాలకు పాల్పడిన బాధిత రైతులకు న్యాయం చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హక్కీంపేట శివారులో ఉన్న జమున హ్యాచరీస్ ఎదుట బుధవారం దళితులు, బలహీన వర్గాల రైతులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి వారికి మద్దతు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, తమ భూములు తమకు ఇప్పించాలని దళిత రైతులు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించారు.
అచ్చంపేట, హక్కీంపేట శివారులో జమున హ్యాచరీస్ పరిశ్రమ భూముల్లో రెండో రోజూ అధికారులు సర్వే నిర్వహించారు. అచ్చంపేట శివారులోని 77,78,79,80,81,82వ సర్వే నంబర్లలోని 84 ఎకరాల్లో సర్వే డీఐ లక్ష్మీ సుజాత ఆధ్వర్యంలో సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్, మాసాయిపేట తాసిల్దార్ మాలతితో కలిసి సర్వేను పర్యవేక్షించి, రైతులతో మాట్లాడారు.