న్యూఢిల్లీ, మార్చి 31: కశ్మీర్ ఫైల్స్ చిత్రం వచ్చాక కశ్మీర్ పండిట్లపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీ.. వారు అక్కడ నివాసం ఉండటానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 1990ల్లో కశ్మీర్ వదిలి వెళ్లిన పండిట్లు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇండ్లు లేక, ఆర్థిక భద్రత లేక రావడం లేదు. తమకు ఆర్థిక సహాయం చేస్తే తిరిగి కశ్మీర్కు వస్తామని చాలా మంది పండిట్లు చెప్తున్నారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ సర్కారు అందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. దక్షిణ కశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో ఉన్న మతన్ ప్రాంతంలో కొన్ని పండిట్ల కుటుంబాలు తిరిగివచ్చాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా అక్కడ నివాసం ఉండటానికి ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. కేంద్రం సాయం చేస్తే మరి కొన్ని కుటుంబాలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వారు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం పండిట్లలకు కావలసిన వసతులన్నీ కల్పిస్తున్నామని చెప్తున్నది. గడిచిన మూడు నాలుగేండ్లలో 6వేల మంది పండిట్లు కశ్మీర్కు తిరిగి వచ్చారని పేర్కొన్నది. వసతుల్లేకపోతే అంత మంది ఎలా తిరిగి వచ్చారని ఎదురు ప్రశ్నిస్తున్నది.
కశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశంలో బీజేపీ విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ దుయ్యబట్టారు. కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాకు అసలు అనుమతే ఇవ్వాల్సిది కాదని, అలాంటిది పలు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీలు కల్పించడం విడ్డూరంగా ఉందన్నారు.
లక్నో, మార్చి 31: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆయన బాబాయి శివ్పాల్ యాదవ్ మధ్య మళ్లీ దూరం పెరుగుతున్నది. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను శివ్పాల్ యాదవ్ కలువడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఎస్పీ కూటమి నుంచి శివపాల్ వర్గం బయటికి వచ్చే సూచనలు ఉన్నాయని, అనంతరం ఆయన బీజేపీ కూటమిలో చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శివపాల్ బీజేపీ రాజ్యసభ సీటు కేటాయించనున్నదని ప్రచారం జరుగుతున్నది.