Roger Federer : టెన్నిస్ టోర్నమెంట్ కఠిన నిర్ణయాలు, గంటల కొద్దీ ప్రయాణం ఈ కాలం అథ్లెట్లను మానసిక సమస్యలకు గురిచేస్తున్నాయని స్విట్జర్లాండ్ మాజీ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ అన్నాడు. టోక్యోలో మీడియా సమావేశంలో అథ్లెట్ల మానసిక ఆరోగ్యం గురించి ఆదివారం ఫెదరర్ మాట్లాడాడు. ‘మీరు బలంగా ఉన్నారని చూపించాలి. అయితే, మనం యంత్రాలం కాదు. మనం మనుషులం’ అని రోజర్ ఫెదర్ అన్నాడు. టోర్నమెంట్ల సందర్భంగా ఆటగాళ్లకు కఠినమైన ఆంక్షలు విధిస్తున్న ఏటీపీ, డబ్య్లూటీఏ మీద ఫెదరర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘టోర్నమెంట్ చాలా కష్టంగా ఉంది. మ్యాచ్ ప్రాక్టీస్, గంటల కొద్దీ విమాన ప్రయాణం వల్ల నేను అలసిపోయాను అని ఎవరూ బయటికి చెప్పరు. ఒకవేళ అలా చెప్తే మీరు బలహీనంగా ఉన్నారని అర్థం చేసుకుంటారు అని ఫెదరర్ అన్నాడు. అంతేకాదు వారం వారం ర్యాంకింగ్లు విడుదల చేయడం, కఠినమైన డోప్ పరీక్ష, ప్రతిరోజు డోపింగ్ నియమాలు పాటించడం వంటివి ఆటగాళ్ల మీద ఒత్తిడిని పెంచుతున్నాయి’ అని మాజీ స్విస్ టెన్నిస్ స్టార్ తెలిపాడు. జపాన్కు చెందిన నవామి ఒసాకా, నిక్ కిర్గియోస్ వంటి అథ్లెట్లు తాము మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నామని గతంలో వెల్లడించారు.
సెప్టెంబర్ నెలలో ఫెదరర్ టెన్నిస్కు వీడ్కోలు పలికాడు. ఈ సొగసరి ఆటగాడు తన కెరీర్లో 20 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచాడు. వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడిగా 237 వారాలు కొనసాగి రికార్డు సృష్టించాడు. అయితే, శరీరం సహకరించకపోవడం, కొత్తతరం దూసుకొస్తుండడంతో ఫెదరర్ తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్కు గుడ్ బై చెప్పాడు.