యమునానగర్: యమునా నది ఉప్పొంగుతోంది. హర్యానాలోని యుమునానగర్ జిల్లాలో ఉన్న హత్నీకుండ్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయి చేరుకున్నది. ఆ బ్యారేజ్ వద్ద 2,95,912 క్యూసెక్ల నీరు ప్రవహిస్తోన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ప్రవాహం అని వెల్లడించారు. వరద నీరు 2.5 లక్షల క్యూసెక్లు దాటితే అప్పుడు దాన్ని తీవ్రమైన వరదగా పరిగణిస్తారు. సాధారణంగా హత్నీకుండ్ నుంచి ఢిల్లీకి నీరు ప్రవహించేందుకు సుమారు 72 గంటల సమయం పడుతుంది. యమునా నదిలో నీటి ఉదృతి పెరగడంతో.. జిల్లా అధికారులు అప్రమత్తత ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో యమునా నది పరివాహాక ప్రాంతాల్లో నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఈ వర్షాకాలంలో ఇదే అత్యధిక ప్రవాహం అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ కుమార్ తెలిపారు.