బల్లియా: కరోనా మహమ్మారి ఒక్కొక్కరికి ఒక్కోరకం తిప్పలు తెచ్చిపెట్టింది. రెండేండ్ల క్రితం ఈ మహమ్మారి పుట్టింది మొదలు ఇప్పటివరకు జనం గుండెల్లో రకరకాలుగా గుబులు రేపుతూనే ఉన్నది. ఎటువెళ్లినా కరోనా అంటుకుంటుందేమోనన్న భయం కొందరికి, దగ్గొచ్చినా జలుబు చేసినా కరోనా సోకిందేమోనన్న భయం ఇంకొందరికీ.. కరోనా రాకుండా టీకా వేసుకోవాలనే ఆరాటం కొందరిది, టీకా వేసుకుంటే రియాక్షన్ అవుతుందేమోనన్న అపోహ మరికొందరిది.
టీకా గుచ్చితే ఎంత నొప్పిగా ఉంటుందోనని తప్పించుకు తిరుగుతున్న విచిత్ర వైఖరి ఇంకొందరిది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలో అలాంటి విచిత్ర వైఖరి కలిగిన ఇద్దరు వ్యక్తులను అధికారులు దొరకబట్టి ఎట్టకేలకు టీకాలు వేశారు. అయితే, వారికి టీకాలు వేయడానికి అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. బల్లియా జిల్లా రియోటీ బ్లాక్లో ఓ బోట్ మ్యాన్ ఇప్పటివరకు టీకా తీసుకోలేదని గుర్తించి అధికారులు అతని దగ్గరకు వెళ్లారు.
అధికారులను చూసి అతను పడవెక్కి నీళ్లలోకి వెళ్లాడు. పడవదిగి రమ్మని అధికారులు ఎంతచెప్పినా పట్టించుకోలేదు. అయినా అధికారులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో కోపంతో పడవదిగి వాళ్లపై దాడికి ప్రయత్నించాడు. ఎట్టకేలకు అధికారులు నచ్చజెప్పి అతనికి టీకా వేశారు. అదే బ్లాక్లో మరోచోట ఓ వ్యక్తి అధికారులు టీకా వేసేందుకు వచ్చారని తెలిసి చెట్టెక్కాడు. గంటలకొద్ది వేచిచూసినా దిగలేదు. చివరిక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ రంగంలోకి దిగి అతడిని చెట్టుదించడమేగాక, నచ్చజెప్పి టీకా వేయించారు.
ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భయంతో చెట్టెక్కి ఒకరు, పడవెక్కి ఇంకొకరు చేసిన హంగామాను ఈ కింది వీడియోల్లో మీరు కూడా ఓసారి చూడండి..