నర్సాపూర్లో అసంపూర్తిగా ‘పల్లెప్రగతి’పనులు
చినుకు పడితే చివరి మజిలీకి ఇబ్బందే..
ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ప్రకృతి వనం, గుట్ట కింద వైకుంఠధామం
నీరందక ఎండిపోతున్న మొక్కలు
బోరు వేసినా ఫలితం శూన్యం
వెంకటాపూర్, మార్చి 22: పల్లెప్రగతితో అన్ని గ్రామాలు అభివృద్ధిబాట పడుతుంటే, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నర్సాపూర్ మాత్రం వెనుకబడింది. అవగాహన, ముందుచూపు లేకుండా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో గుట్ట పైన పల్లె ప్రకృతివనం, గుట్టకింద వైకుంఠధామం, ఏర్పాటుచేసినా ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వనాన్ని చూసేవాళ్లు లేక నీళ్లు పెట్టకపోవడంతో వనంలోని మొక్కలు ఎండిపోగా, శ్మశానవాటిక ఇంకా అసంపూర్తిగానే ఉన్నది.పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామాలకు ఇచ్చినట్టే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి ప్రభుత్వం నెలనెలా నిధులిచ్చింది. కానీ, అధికారులు, గ్రామ పాలకుల నిర్లక్ష్యంతో ఆ నిధులన్నీ వృథా అయ్యాయి. ముందుచూపు లేకుండా నిర్మించిన వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం గ్రామస్తులు ఉపయోగించుకోలేని దుస్థితి.
ఉదయం, సాయంత్రం ప్రజలు సేదతీరడానికి, ఆహ్లాదంగా గడుపడానికి గ్రామాలకు ఆనుకొని పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే, ఇక్కడ మాత్రం మూడు కిలోమీటర్ల దూరంలో గుట్టమీద ఏర్పాటు చేశారు. ఊరి ప్రజలు అక్కడికి వెళ్లలేని పరిస్థితి. గుట్ట కావడంతో నాటిన మొక్కలు ఏనుకోలేదు. అక్కడక్కడా కొన్ని ఏనుకున్నా నీళ్లందక ఎండిపోతున్నాయి. బోరు వేసినా దానికి కరంటు కనెక్షన్ ఇవ్వలేదు. ట్యాంకర్ సహాయంతో నీళ్లు పోస్తున్న చాలామొక్కలు ఎండిపోయాయి. కొన్ని చోట్ల మొక్కల ఆనవాళ్లు కూడా లేవు. ఇక అదే గుట్ట కింద నిర్మించిన శ్మశాన వాటికకు వెళ్లాలంటే సాహసయాత్ర చేయాల్సిందే. అందులో ఇంకా కొన్ని పనులు పెండింగ్లోనే ఉన్నాయి. ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశాన వాటికకు, ప్రకృతి వనానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సదుపాయం లేదు. చినుకు పడితే చివరి మజిలీకి ఇబ్బందులు తప్పవు.