జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు సన్నాహాలు
సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న పర్యాటక శాఖ
ఇప్పటికే పద్మాక్షి, పాండవుల గుట్టల్లో ట్రెక్కింగ్
తాజాగా కడిపికొండ బోడగుట్ట వద్ద
హన్మకొండ, మార్చి 25 : పర్యాటకానికి పెట్టింది పేరైన ఉమ్మడి వరంగల్ జిల్లా, సాహస క్రీడల్లోనూ ప్రత్యేకత సంతరించుకోనుంది. నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక గుట్టల సముదాయం ఉన్నది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ కొండలపై సాహస క్రీడల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల అడ్వెంచర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సంవత్సరాల నుంచి హన్మకొండలోని పద్మాక్షిగుట్ట, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవుల గుట్ట వద్ద ట్రెక్కింగ్, ైక్లెంబింగ్ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలోని కడిపికొండ బోడగుట్ట వద్ద ట్రెక్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఇవే గాక ఉమ్మడి జిల్లా పరిధిలో మరికొన్ని సాహస క్రీడా ప్రాంతాలను గుర్తించినట్లు పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ అడ్వెంచర్ క్లబ్ నిర్వాహకులు రంగారావు ఆధ్వర్యంలో నిపుణులు ఉమ్మడి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాలను సాహస క్రీడల కోసం పరిశీలించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు సన్నాహాలు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సాహస క్రీడా పోటీలు నిర్వహించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అనువుగా ఉన్న ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఏయే జిల్లాలో క్రీడలకు అనువుగా ఉన్నాయనే నివేదికను ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు నివేదించినట్లు పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్, ైక్లెంబింగ్, బోటింగ్, జిప్, రోప్వే పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సాహస క్రీడల నిర్వహణకు కసరత్తు చేయనున్నట్లు అధికారులు చెప్పారు.
ట్రెక్కింగ్ స్పాట్లు ఇవీ..
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో పలుచోట్ల ట్రెక్కింగ్ స్పాట్లు ఉన్నట్లు పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లిలోని కొత్తకొండ, రత్నగిరి, ధర్మసాగర్ మండలంలోని ఇనుపరాతి గుట్టలు, హన్మకొండలోని పద్మాక్షిగుట్ట, వడ్డేపల్లి చెరువులున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవులగుట్ట, కాటారం మండలంలోని ప్రతాపగిరికోట, ములుగు జిల్లాలోని రామప్ప, మల్లూరు గుట్ట, లక్నవరం, గోదావరి వద్ద ముల్లకట్ట, మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, బయ్యారం గుట్టలు, కొత్తగూడ, భీముని పాదం ఉన్నాయి.