హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 15న ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభను 29కి వాయిదా వేసింది. వరంగల్లో నిర్వహించనున్న సభను రెండు వారాలు వాయిదా వేయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, ధర్మారెడ్డి తదితరులతో కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు తెలంగాణ విజయగర్జన సభను వాయిదా వేసి, ఈ నెల 29న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించాలని అభ్యర్థించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ సారథి కేసీఆర్ 2009, నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆ రోజును ప్రతి సంవత్సరం దీక్షా దివస్గా జరుపుకొంటున్న నేపథ్యంలో అదే రోజు తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహణకు తగిన సందర్భమని నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్ర సాధనకు మూలమైన దీక్షాదివస్ నాడే సభ జరుపాలన్న నాయకుల అభ్యర్థన పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వారి కోరిక మేరకు సభను 29న నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 20 ఏండ్లు గడిచిన సందర్భంగా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయ గర్జన సభను నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కమిటీలు ఏర్పాటయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల పార్టీ నేతలు సభ తేదీ మార్పును గమనించాలని సీఎం కోరారు. ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను, బస్సులు తదితర రవాణా వ్యవస్థలను 29వ తేదీకి మార్చుకోవాలని సూచించారు.
సభ నిర్వహణకు కసరత్తు
సభా స్థలం పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
హనుమకొండ, నవంబర్ 1: తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చారిత్రక వరంగల్ నగరంలో నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు మంత్రులు, నాయకులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నగర సమీపంలోని శివారు ప్రాంతాలైన మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ల వద్ద ఖాళీ స్థలాలను సోమవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పరిశీలించారు. విజయ గర్జన సభకు భారీ ఎత్తున జనాలు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అనువైన స్థలాలను పరిశీలిస్తున్నారు.