ఖానాపురం, నవంబర్ 30 : ‘పాకాల అభయారణ్యంలోకి పులి ప్రవేశించింది. సమీప అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని’ వరంగ ల్ డీఎఫ్వో అర్పన అన్నా రు. కొద్ది రోజలుగా భద్రా ది కొత్తగూడెం, మహబుబాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి, పాకాల అడవిలోకి ప్రవేశించిందని ఆమె తెలిపారు. సోమవారం సంగెం కాలువ సమీపంలో పలువురు వాహనదారులకు కనిపించడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు డీఎఫ్వో ఆధ్వర్యంలో మంగళవారం ఆనవాళ్లు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగు టీములుగా ఏర్పడి పాకాల అడవిలో పులి తిరిగిన ప్రదేశాలను గుర్తించారు.
ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ అశోక్నగర్-2 బీటు పరిధిలో పర్శనాయక్తండాకు వెళ్లే మార్గంలో కొమ్మాలు అనే రైతు పొలంలో పాదముద్రలను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం పులి పాకాల అడవిలో ఉందని, ట్రాప్ చేయడానికి 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. సమీప అటవీ గ్రామాలైన అశోక్నగర్, దబీర్పేట, కీర్యతండా, పర్శనాయక్తండా, చిలుకమ్మతండా, చిలుకమ్మనగర్, బండమీదిమామిడితండా, మనుబోతులగడ్డ, బోటిమీదితండా, నాజీతండాలతో పాటు నల్లబెల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెలు, మేకల కాపరులు అడవిలోకి వెళ్లొద్దన్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎఫ్ఆర్వో రమేశ్, డీఆర్వోలు మోహన్, ఎజాజ్, బీట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.