నర్సంపేట రూరల్, డిసెంబర్ 5: అసలే పేదరికం.. ఆపై ఆర్థిక ఇబ్బందులు.. మరోపక్క కుటుంబ యజమాని ఆత్మహత్య.. వెరసి ఆ కుటుంబం రోడ్డున పడి ఆపన్నుల సాయం కోసం ఎదురుచూస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామం బుడిగెజంగాల కాలనీకి చెందిన పర్ధం హరీశ్(27) వివాహం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన రాజేశ్వరితో తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. హరీశ్ గ్రామాలు తిరుగుతూ పట్టె మంచాలకు నవార్లు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. నిలువ నీడ లేకపోవడంతో గ్రామ శివారులోని కెనాల్ ఒడ్డున డేరా వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. సెంటు భూమి లేకపోవడంతో రాజేశ్వరి స్థానికంగా కూలీనాలి చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నది.
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం హరీశ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మంచం నవార్లు అమ్మడం వీలు కాక ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటు భూమి లేక.. అటు జీవనాధారం కరువై ముగ్గురు ఆడపిల్లలు, భార్యను సాకలేక మనస్తాపం చెందాడు. ఈ నెల 1న అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లక్నేపల్లి గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు చందాలు వేసుకుని హరీశ్ దహనసంస్కారాలు నిర్వహించారు. ఇంటి యజమాని మృతితో భార్య, ముగ్గురు ఆడ పిల్లలు దిక్కుదోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీరి పరిస్థితిని చూసిన వారంతా అయ్యో పాపం.. అంటూ చలించిపోతున్నారు.
దాతలు స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తమకు తోచిన సాయం అందించి ముగ్గురు ఆడ పిల్లలు, తల్లికి అండగా నిలువాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు చేసే గొప్ప సాయం ముగ్గురు ఆడపిల్లల చదువు, ఆర్థిక అవసరాలు, ఇంటి నిర్మాణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. దాతలు సాయం చేయాలంటే.. 9949485539 (పర్ధం రమేశ్ (మృతుడి అన్న) గూగుల్ పే, లక్నేపల్లి ఉపసర్పంచ్ పరాచికపు సంతోష్-8374075075 ఫోన్పే లేదా 375901000000417 (పర్ధం లక్ష్మక్కా, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు) అకౌంట్లో దయార్ధ హృదయాలు ఆర్థిక సాయం జమ చేయాలని కోరుతున్నారు.