వనపర్తి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పోడు భూ ముల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పరిష్కారం చూపనున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం కలెక్టర్ షేక్యాస్మిన్ బాషా అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ సమావే శం నిర్వహించారు. సమావేశానికి మంత్రి హాజరై మా ట్లాడారు. అటవీ భూమిని సాగుచేసుకొని జీవనం సాగిస్తున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు ప్రతి ఒక్కరం పా టుపడుదామన్నారు. హరితహారం కార్యక్రమం వల్ల 4 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని మరో 6శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రతి గ్రామంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చిన నివేధిక ఆధారంగా రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల సంయుక్త సర్వేతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. దీనికి అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనున్నదని, దీని ఆధారంగా పట్టాలు అందజేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో 28, 343ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందన్నారు. మొత్తం 24 అటవీ బ్లాక్లు ఉన్నాయని, ఆరు మండలాల్లో 36గ్రామాల్లో అటవీ ఆక్రమణలు ఉన్నాయన్నారు. అక్రమణకు గురైన భూమి విస్తీర్ణం 2,378 ఎకరాలు ఉందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 8నుంచి డిసెంబర్ 8వరకు క్లెయిమ్స్ తీసుకుంటుందన్నారు. అటవీ భూములు ఒక అంగులం ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు, ప్రజలపై ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ భూములను పరిరక్షించేందుకు అవసరమైతే పోలీస్శాఖ సహాయం తీసుకుంటుందన్నారు. అటవీ భూములను ఆక్రమిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సర్వే సమయంలో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, చీప్ కంజర్వేటర్ శృతిఓజా, ఎస్పీ అపూర్వరావు, తాసిల్దార్ రాజేందర్గౌడ్, ఫారెస్ట్ అధికారి రామకృష్ణ, జెడ్పీటీసీలు భార్గవి, వెంకటేశ్వరమ్మ, రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యు డు మునీరుద్దీన్, వక్ఫ్బోర్డు సభ్యులు హర్షద్, జహంగీర్, వివిద పార్టీల నాయకులు పాల్గొన్నారు.