పది భాషల్లో వెయ్యి సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన శివ శంకర్ మాస్టర్ కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. 75 శాతం పైగా ఊపిరితిత్తులు పాడయ్యాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. వైద్యానికి లక్షలలో ఖర్చు అవుతుండడంతో దాతలు సాయం చేయాలని ఆయన చిన్న కొడుకు కోరారు.
దీంతో సోనూసూద్ వెంటనే స్పందించారు. తాను అండగా ఉంటానని అన్నారు. తమిళ నటుడు ధనుష్ పదిలక్షల రూపాయలు సాయం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా తాను డబ్బులు ఇచ్చిన విషయం గురించి పబ్లిసిటీ చేయవద్దని ధనుష్ కోరినట్లు తెలుస్తుంది. అయితే టాలీవుడ్లో ఎన్నో సూపర్హిట్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన ఆయనకు టాలీవుడ్ నుంచి స్పందన లేకపోవడం ఏంటని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
ఈ క్రమంలో మంచు విష్ణు శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటామని మంచు విష్ణు హామీ ఇచ్చారు. ఆయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి శివశంకర్ మాస్టర్ కు మెరుగైన వైద్యం అందించాలని కోరినట్టు తెలిపారు. అలానే శివశంకర్ మాస్టర్ కుమారుడు అజయ్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పానని కూడా అన్నాడు విష్ణు.