అధికారం తమ చేతుల్లో ఉన్నదని వేధించటం, చెప్పింది చేయకపోతే చంపటం, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే వెంటనే దర్యాప్తునకు ఆదేశించటం.. బీజేపీకి ఇది పరిపాటిగా మారిపోయింది. అందుకు తాజాగా ఉత్తరాఖండ్లో చోటుచేసుకొన్న ఘటనే ఉదాహరణ. బీజేపీ సీనియర్ నేత కొడుకు హత్య చేస్తే.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకోవటంతో అక్కడి బీజేపీ సర్కారు సిట్ దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకొన్నది.
హరిద్వార్, సెప్టెంబర్ 24: ఉత్తరాఖండ్లో రిసార్ట్ రిసెప్షనిస్టు అంకిత భండారి (19) హత్య ప్రకంపనలు సృష్టిస్తున్నది. బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య ఆ యువతిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది. అందుకు ఆమె ఒప్పుకోకపోవటంతోనే చంపి కాలువలో పడేసినట్టు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. ఈ ఘటన ఈ నెల 19న చోటుచేసుకోగా.. శనివారం ఆమె మృతదేహాన్ని రిషికేశ్లోని చీలా కాలువ నుంచి పోలీసులు వెలికి తీశారు. యువతి హత్యతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. రిసార్టులో ఫర్నిచర్ను ధ్వంసం చేసి, మొత్తం తగులబెట్టారు. మృతదేహాన్ని చూడటానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రేణు బిస్త వాహనంపై దాడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు బీజేపీ పాలనను ఎండగట్టాయి. పరిస్థితి చేయి దాటిపోతుందని తెలుసుకొన్న రాష్ట్ర ప్రభుత్వం హత్య కేసుపై సిట్ను ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి, ప్రస్తుతం మతి కళా బోర్డు చైర్మన్గా ఉన్న వినోద్ ఆర్య, ఆయన ఇంకో కొడుకును పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది.
రిసార్ట్ను కూల్చేసిన అధికారులు
హత్యపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగటంతో స్పందించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి.. నిందితుడికి చెందిన వనతార రిసార్టును కూల్చివేయాలని ఆదేశించారు. అధికారులు బుల్డోజర్తో దాన్ని కూల్చేశారు. రాష్ట్రంలోని అన్ని రిసార్ట్లపై దర్యాప్తు చేపట్టాలని ధామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీఐజీ రేణుకాదేవి నేతృత్వంలోని సిట్కు ఈ కేసును అప్పగిస్తున్నట్టు తెలిపారు.
ఘటన జరిగిందిలా..
ఉత్తరాఖండ్లోని యంకేశ్వర్లో పుల్కిత్ ఆర్య నడుపుతున్న రిసార్ట్లో అంకిత రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నది. ఆమెను వ్యభిచారం చేయాలని రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో రిసార్ట్ మేనేజర్ సౌరవ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాతో కలిసి యువతిని చంపి చీలా కెనాల్లో పడేశారు. మహిళా ఉద్యోగి మిస్సింగ్ అంటూ పుల్కిత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆమె కనిపించకుండా పోయిందని గత సోమవారం కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయటంతో హత్య చేశానని ఒప్పుకొన్నాడు. అతడిని, సహకరించిన ఇద్దరు స్టాఫ్ మెంబర్లను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేశారు. వారిని శనివారం కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వీవీఐపీలకు స్పెషల్ సర్వీస్ చేయాలని..
రిసార్ట్కు వచ్చే వీవీఐపీలకు స్పెషల్ సర్వీస్ చేయాలని తనను ఒత్తిడి చేసినట్టు యువతి తన స్నేహితురాలితో చెప్పిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది. ‘నన్ను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు’ అని ఆ చాట్లో పేర్కొన్నది. ఒక్కో క్లయింట్ దగ్గర రూ.10 వేలు వసూలు చేసి, తనను రొంపిలోకి లాగాలని చూస్తున్నారని తెలిపింది. ఓ వ్యక్తి తనను అసభ్యం తాకాడని, దీనిపై బయట ఎక్కడా చెప్పొద్దని పుల్కిత్ హెచ్చరించినట్టు వెల్లడించింది. యువతి రిసార్టులోని వేరే ఉద్యోగితో మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవుతున్నది. ఘటన జరిగిన రోజు రాత్రి 8:30 తర్వాత అంకిత ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చిందని, పుల్కిత్కు ఫోన్ చేస్తే ఆమె రూమ్కు వెళ్లిందని చెప్పినట్టు మరో వ్యక్తి మీడియాతో తెలిపారు. తర్వాత రోజు మేనేజర్కు ఫోన్ చేస్తే జిమ్ వెళ్లిందని, చెఫ్కు కాల్ చేస్తే అసలు ఆమెను చూడలేదని చెప్పినట్టు వెల్లడించారు.