పరిగి, నవంబర్ 11 : వికారాబాద్ జిల్లాను కూరగాయల హబ్గా మార్చేందుకు ఉద్యానవన అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులుగా కూరగాయల సాగుకు జిల్లా నేలలు అనువైనవని ఉద్యాన వన శాఖ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరానికి అనుకొని ఉన్నందున మార్కెటింగ్ సదుపాయం ఉండడం వల్ల కూరగాయల పంటలు సిరులు కురిపిస్తాయన్నది వాస్తవం.
50వేల ఎకరాలకు కూరగాయలు సాగు…
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్లో కేంద్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాను కూరగాయల సాగుకు ఎంపిక చేసింది. హైదరాబాద్ జనాభా కోటి 10 లక్షలు ఉండగా, నిత్యం 3 నుంచి 4వేల టన్నుల కూరగాయలు అవసరం. ఇందులో కేవలం 35 శాతం కూరగాయలే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తుండగా, మిగతా 65 శాతం కూరగాయలు ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ను ఆనుకొని ఉన్నందున మార్కెటింగ్ ఇబ్బందులు లేవు. ప్రస్తుతం జిల్లాలో 28వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా, రాబోయే మూడేండ్లలో జిల్లాలో 50వేల ఎకరాలకు పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లో భాగంగా జిల్లా పరిధిలో 120 ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రం ఏర్పాటుకు ఉద్యాన వన శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు అనువైన భూముల కోసం అధికారులు పరిశీలిస్తున్నారు.
రైతులకు ప్రోత్సాహకాలు..
కూరగాయల సాగు చేసే రైతాంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించాలని నిర్ణయించింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో 80శాతం సబ్సిడీపై కూరగాయల నారు అందించనున్నారు. ఎకరాకు 8వేల మొక్కలు ఏర్పాటు చేసే అవకాశం ఉండగా వాటి తరలింపునకు రవాణా కింద రూ.500 సైతం అందజేస్తారు. ఎరువుల కోసం ఎకరాకు రూ.1500 సబ్సిడీ అందించనున్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పంటలో కలుపు రాకుండా మల్చింగ్ విధానం అమలు చేయడం జరుగుతుంది. మల్చింగ్ విధానానికి హెక్టారుకు రూ.16వేలు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈసారి జిల్లాలో 150 ఎకరాల్లో మల్చింగ్కు సబ్సిడీ అందజేస్తున్నారు. ఒకసారి మల్చింగ్ చేస్తే రెండు పంటలకు వస్తుంది. మల్చింగ్ విధానంతో డ్రిప్ వల్ల నీరు, ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి. కలుపు సమస్య ఉండదు. దిగుబడి సైతం 10శాతం పెరుగుతుందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు.
ఎక్కడెక్కడ కూరగాయలు సాగు..
జిల్లాలోని ప్రతి మండలంలో ఏ గ్రామాల్లో ఏ కూరగాయలు సాగు చేయవచ్చన్నది అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యానవన శాఖ అధికారులు కసరత్తును ప్రారంభించగా, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి సాగు విస్తీర్ణం పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూరగాయల సాగుకు అనువైన భూములు, నీటి వసతి వంటివి గుర్తించడం వల్ల ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో ఏఏ పంటలు సాగు చేయాలనేది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణయించనున్నారు. ఇందుకుగాను జిల్లావ్యాప్తంగా ఉన్న 97 క్లస్టర్లలో ప్రత్యేకంగా రైతుల సమావేశాలు నిర్వహించి ఏ ప్రాంతంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడానికి అవకాశం ఉన్నది గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తారు.
కూరగాయల సాగు పెంచేందుకు ప్రణాళికలు..
వికారాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రాబోయే మూడేండ్లలో కూరగాయల సాగు 50వేల ఎకరాలకు పెంచాలన్నది లక్ష్యం. ఎక్కడెక్కడ కూరగాయల సాగు చేయవచ్చని పరిశీలిస్తాం. రైతులకు 80శాతం సబ్సిడీపై నాణ్యమైన, మేలు రకం కూరగాయల నారు అందిస్తాం. రవాణాకు, ఎరువులకు డబ్బులు అందించడంతోపాటు రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తాం.