హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): త్వరలో జారీ కానున్న గ్రూప్-1 ఉద్యోగ ప్రకటన యువత ఆశలకు రెక్కలు తొడుగుతున్నది. ఒకేసారి 503 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుండటంతో ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదల పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గ్రూప్- 1 కలను సాకారం చేసుకోవటం ఎలా? అనే వేట ప్రారంభమైంది. ఒకవైపు పుస్తకాలు కోకొల్లలు.. మరోవైపు పుట్టగొడుగుల్లా కోచింగ్ సెంటర్లు. దీంతో ఏ పుస్తకాలు చదువాలి? కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధత నెలకొన్నది. ఈ సందర్భంలో ఉద్యోగార్థులకు గ్రూప్ -1 అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, గురుకులాల అదనపు కార్యదర్శి హన్మంతు నాయక్ పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
ఉద్యోగానికి ప్రిపరేషన్ ప్రారంభించే ముందు అందరినీ తొలిచే మొదటి ప్రశ్న ఏ పుస్తకాలు చదవాలి? ఒక సబ్జెక్టుకు సంబంధించి అనేక పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిలో ఏది ఎంపిక చేసుకోవాలనేది అందరినీ తొలిచే ప్రశ్న. పోటీ పరీక్షలు అనగానే అందరూ ఎక్కువ పుస్తకాలు చదివెయ్యాలని ఆతృత పడుతుంటారు. కానీ అది తప్పు. ఎన్ని పుస్తకాలు చదివామన్నది ముఖ్యం కాదు. ఏ పుస్తకాలు చదివాం అన్నదే ముఖ్యం. గ్రూప్ -1 నోటిఫికేషన్ రాగానే కొందరు పుస్తకాలను ప్రమోట్ చేసుకొనే పనిలో పడతారు. అలాంటివాటికి ఆకర్షితులై మోసపోవద్దు. విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు. తెలుగు అకాడమీ, ఎన్సీఈఆర్టీ పుస్తకాలపైనే ఎక్కువ ఆధారపడాలి. పాఠశాలస్థాయిలో ప్రభుత్వ పుస్తకాలను చదవాలి. కొందరు ప్రముఖులు రాసిన పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి. ఏం పుస్తకాలు చదవాలో క్లారిటీ వస్తే ఉద్యోగ సాధనలో సగం విజయం సాధించినట్టే!
గ్రూప్ డిస్కషన్స్కి ప్రాధాన్యం ఇవ్వాలి. రోజంతా చదివేసి సాయంత్రం వేళ ఆ విషయాలను చర్చించుకోవాలి. దీనిద్వారా ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోవచ్చు. ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. గ్రూప్స్ వంటి ఉద్యోగాలకు ఇది ఎంతో కీలకం. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎవరో ఏదో చెప్పారని కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మొదటి నుంచి ఎలా చదవడం అలవాటో అలానే చదవండి. తదేకంగా గంటల కొద్దీ లేవకుండా చదవాల్సిన పనిలేదు. కొంతమంది రోజుకు 18 గంటలు చదివామని చెప్తుంటారు. అంత అవసరం లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలి.
విజయం అనేది మనం రూపొందిచుకున్న ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు నుంచి పరీక్ష పూర్తయ్యేవరకూ ఒక క్యాలెండర్ సిద్ధం చేసుకోవాలి. అందులో రోజువారీ కార్యక్రమాలు ఉండేలా చూసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకొనేవరకు ఎప్పుడు ఏం చదవాలి? రివిజన్ ఎప్పుడు? రోజంతా చదివిన దానిపై పరీక్ష ఎలా? అనే సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఫంక్షన్లు, పార్టీలు పక్కన పెట్టెయ్యాలి. షెడ్యూల్లో ఎప్పుడు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేదాన్ని కూడా చేర్చాలి. తప్పనిసరిగా సొంత నోట్స్ రాసుకోవాలి.
ప్రశ్నలకు అందరూ సమాధానం రాస్తారు. అందరూ పుస్తకాల్లో ఉన్నది రాస్తారు. కానీ, అందులో మీ మార్క్ చూపించాలి. అందరికంటే భిన్నమైన రీతిలో సమాధానం రాయాలి. జవాబులో సంవత్సరాలు, తేదీలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. ఒకప్పటితో పోల్చుకుంటే సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందింది. నెట్ అందుబాటులో ఉంటే ప్రపంచమే అరచేతిలో ఉన్నట్టు. సమాచారం కోసం ప్రభుత్వ వెబ్సైట్లపై ఎక్కువగా ఆధార పడాలి. పుస్తకాల్లో ఉన్నా లేకున్నా వెబ్సైట్లో సమాచారంతో సమగ్ర విధానంలో సమాధానాలు రాయొచ్చు. ప్రతి ప్రశ్నకు అప్డేట్ సమాచారంతో జవాబు రాస్తే అందరికంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. రోజూ న్యూస్ పేపర్లు చదవడం అలవాటు చేసుకోవాలి. అందులోని ప్రతి అంశాన్ని శ్రద్ధగా అర్థం చేసుకోవాలి.
ఎగ్జామ్ హాల్కు వెళ్లిన వెంటనే చాలామంది టెన్షన్కు గురవుతారు. హడావిడిగా జవాబులు రాసే పనిలో పడొద్దు. ప్రతి ప్రశ్న కీలకమే. ప్రశ్నలను అర్థం చేసుకోవడం మీదే మనం రాసే జవాబు ఆధార పడి ఉంటుంది. ఎంత శ్రద్ధతో కష్టపడి చదివినా, ప్రశ్నలను అర్థం చేసుకోలేకపోతే శ్రమంతా వృథా అయినట్టే. అభ్యర్థులు తప్పనిసరిగా కొంత ప్రత్యేక సమయం కేటాయించి ప్రశ్న పత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదవాలి. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలి అనే విషయం కూడా ముఖ్యమే. గ్రూప్-1 మెయిన్స్లో 900 మార్కులకు తప్పనిసరిగా జవాబులు రాయాలి. ఏ ఒక్కటి రాయకపోయినా విజయానికి దూరమైనట్టేనని గ్రహించాలి. చదివినదాన్ని పరీక్షలో సమర్థంగా రాయాలంటే రివిజన్ తప్పనిసరి.