న్యూఢిల్లీ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్కు సూచించారు. నూతనంగా సహాయమంత్రిగా నియామకమైన అజయ్ భట్ ఆదివారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యను వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. ఈ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా చర్యలు తీసుకుని, సమస్యను పరిష్కరించాలని సహాయమంత్రికి సూచించారు. ఈ సమస్యకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు రాసిన లేఖ గురించి సైతం ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి, తెలియజేస్తామని అజయ్ భట్ ఉపరాష్ట్రపతికి తెలిపారు.