శాన్ఫ్రాన్సిస్కో: ఏదో సినిమాలో సుత్తి వీరభద్రరావు కోపం వచ్చినప్పుడు ఎడాపెడా కొట్టడానికి ఓ వస్తాదును నియమించుకుంటాడు. అమెరికాకు చెందిన మనీశ్ సేఠీ అనే భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త దీనికి ఉల్టాగా వెళ్లారు. అంటే తననే కొట్టేందుకు కారా అనే ఓ మహిళా ఉద్యోగిని నియమించుకున్నారు. ఆమె చేయాల్సిన పనేమిటంటే సేఠీ ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా చెంప చెళ్లుమనిపించాలి. ముందుగా వద్దు అని గట్టిగా అరవాలి. అప్పటికీ మానకపోతేనే కొట్టాలి సుమా అని క్లాజు పెట్టారు. ఇందుకు ఆమెకు గంటకు 8 డాలర్ల జీతం. అంటే రూపాయల్లో సుమారు 6-7 వందలు. ఆఫీసులో లేక తాను ఇష్టంగా పనిచేసుకునే మిషన్ కేఫ్లో ఆమె తన వెన్నంటి ఉండాలి. ఇలా దెబ్బలు తిన్నందుకు ఫలితం బాగానే దక్కిందట.
ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ పావ్లోక్ సీఈవో అయిన సేఠీ కారా దెబ్బల వల్ల తన ఉత్పాదకత 35-40 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని బ్లాగులో వెల్లడించారు. చెంపలు వాయించే ఉద్యోగి కావాలంటూ 2012లో తాను క్రేగ్ లిస్టులో యాడ్ వేసినప్పుడు జనం నవ్వుకున్నారు. అయితే కొట్టడం ముఖ్యం కాదు, నా పనిని పర్యవేక్షించే ఓ బాస్ లా కారా పనిచేస్తున్నది అని పేర్కొన్నారు. తాజాగా సేఠీని కారా చెంప వాయిస్తున్న ఫొటో నెట్లో వైరల్ అయింది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విట్టర్లో దీనిపై రెండు ఇమోజీలు పెట్టారు. దీనిపై సేఠీ స్పందిస్తూ రెండు ఇమోజీలు అంటే చాలా గౌరవమే అని చమత్కరించారు. ‘రెండింటిలోనూ మంటలు ఉండడం దేనికి సంకేతం. మన కీర్తి జ్వాలలు ఆకాశాన్ని తాకాయని దీని అర్థమా? ఏమో కాలమే చెప్తుంది’ అని సేఠీ కామెంట్ పెట్టారు.