న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: రైతులకు నమ్మకద్రోహం చేసిన బీజేపీని వచ్చే ఎన్నికల్లో శిక్షించాలని ఉత్తరప్రదేశ్ రైతులకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చింది. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై కమిటీ ఏర్పాటు, నిరసనోద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను నెరవేరుస్తామన్న కాషాయపార్టీ అనంతరం అన్నదాతలను మోసగించిందని పేర్కొంది. ఈ మేరకు స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ గురువారం తెలిపారు. ఎస్కేఎం ఇచ్చిన పిలుపునకు 57 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయన్నారు. అయితే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున కూడా ఎస్కేఎం ఓట్లడగబోదన్నారు. రాజకీయాలకు దూరంగా రైతుల కోసం ఎస్కేఎం ఉద్యమిస్తుందన్నారు.
కరపత్రాలుగా బీజేపీ మోసాలు
యూపీలోని మీరట్, కాన్పూర్, సిద్ధార్థ్నగర్, గోరఖ్పూర్, లక్నో వంటి తొమ్మిది ప్రాంతాల్లో రానున్న రోజుల్లో మీడియా సమావేశాలను నిర్వహిస్తామని యోగేంద్ర యాదవ్ తెలిపారు. కేంద్రప్రభుత్వం రైతులను ఎలా మోసగించిందన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. యూపీవ్యాప్తంగా బీజేపీ మోసాలను కరపత్రాలుగా పంచుతామన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచే బరిలో ఉన్నారు.
యోగి కంప్రెషర్ ఏమీ కాదు
బీజేపీని గద్దెదించేందుకు అంబేద్కర్వాదులు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో కలిసి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) చీఫ్ జయంత్ చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాషాయదళాన్ని అధికారం నుంచి దించితేనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని, పౌరుల హక్కులు కాపాడగలమని అఖిలేశ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే మార్చి 10న అందరినీ కూల్ చేస్తానన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘మమ్మల్ని కూల్ చేయడానికి ఆయన కంప్రెషర్ కాదు. ఆయన యూపీ సీఎం’ అన్నారు. యోగి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేని బీజేపీని యువత ఓడించాలని పిలుపునిచ్చారు.
భయపెడితే మరింత శక్తిని కూడగడుతాం
ఎస్పీ, ఆరెల్డీ కూటమిని బలహీనపరిచేందుకు బీజేపీ యత్నిస్తున్నదని ఆరెల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఆరోపించారు. తమ కూటమిలో పెద్దఎత్తున చేరికలు బీజేపీకి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయన్నారు. యోగిని ఉద్దేశిస్తూ.. సీఎం హోదాలోని ఓ వ్యక్తి మాట్లాడే తీరు, భాష ఇదికాదని మండిపడ్డారు. పశ్చిమ యూపీలో బీజేపీ పరిస్థితిని, ప్రజానాడిని యోగి సరిగ్గా అర్థం చేసుకోవడం లేదన్నారు. యోగి తమను ఎంతగా బెదిరింపులకు గురిచేస్తే అంత శక్తిమంతంగా మారుతామన్నారు.