Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులకు పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోతోపాటు ఇరత ప్రాంతాలపై ఏకంగా 1,000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 20 మంది వరకు గాయపడ్డారు. రష్యాలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం తుదిదశ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ దాడి చేయడం కీలకంగా మారింది. శనివారం రాత్రి నుంచి ఉదయం వరకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద దాడి ఇదే అని విశ్లేషకుల అంచనా. ఈ దాడిపై మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ మాట్లాడారు. రష్యా రాజధానిపై జరిగిన అతిపెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు. మాస్కోలోని ఆయిల్ రిఫైనరీతోపాటు, ప్రజల నివాసాలపై కూడా దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో 74 ఏళ్ల ఒక వృద్ధుడు, 44 ఏళ్ల మహిళ ఉన్నారు.
ఈ దాడిపై రష్యా రక్షణ శాఖ కూడా స్పందించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 1,100 డ్రోన్లను తాము కూల్చివేశామని రష్యా చెప్పందది. రష్యాలోని క్రిమియాతోపాటు నల్ల సముద్రంపై కూడా దాడి జరిగిందని తెలిపింది. మాస్కోపై ప్రయోగించిన 450 డ్రోన్లను తాము నిర్వీర్యం చేశామని రష్యా ప్రకటించింది. తమ దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్ని ఆపేసేందుకే ఉక్రెయిన్ ఈ దాడులకు దిగుతోందని రష్యా ఆరోపించింది. అయితే, ఈ దాడిపై ఉక్రెయిన్ ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.