లండన్: బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్ష చేశారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్న వారిని కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. అంతకు ముందు రోజు సాజిద్ పార్లమెంట్లో ఉండడంతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్తో పాటు ఆర్థిక మంత్రి రిషి సునక్ ఐసోలేషన్లో ఉంటునట్లు బ్రిటన్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. సాజిద్ జావిద్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత ఆయన వైరస్కు పాజిటివ్గా పరీక్షించారు.
ఇంతకు ముందు బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న మ్యాట్ హ్యాన్కాక్ పదవికి రాజీనామా చేయడంతో గత నెల 26న పాక్ సంతతికి చెందిన సాజిద్ (51) బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే. ఇదిలాఉంటే, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం వైరస్ బారినపడే అవకాశాలుంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఆసుపత్రిలో చేరికలు, ప్రాణాపాయం ఉండదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా ఆంక్షలను సడలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బ్రిటన్లో మహమ్మారి విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి తర్వాత తొలిసారిగా 51,870 కేసులు నమోదయ్యాయి.