హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అమెరికా సైన్యంలోని ‘మెరైన్స్ కాప్స్’ విభాగం ఏర్పాటై ఈ నెల 10వ తేదీతో 246 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లో ‘మెరైన్ కాప్స్ డే’ నిర్వహించారు. కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత నేవీ ఈస్టర్న్ ఫ్లీట్ రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జోయెల్ రీఫ్మన్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో తొలిసారి మెరైన్ బాల్ (మెరైన్ కాప్స్డే వేడుకలు) నిర్వహిస్తున్నందుకు గర్వంగా ఉన్నదన్నారు. 1948 నుంచి యూఎస్ కాన్సులేట్ల రక్షణలో మెరైన్ కాప్స్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 181 కాన్సులేట్లకు రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. గతేడాది జూన్లో యూఎస్ మెరైన్ కాప్స్కు చెందిన 8 మంది హైదరాబాద్లోని కాన్సులేట్లో చేరారన్నారు. భారత్-అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయని, భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయని అన్నారు.