సిటీబ్యూరో, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): ఏ మాత్రం తేడా లేకుండా.. ఫొటో షాప్ ద్వారా అసలును పోల్చేలా మక్కీకి..మక్కీగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నిందితులను హైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 223 ఫేక్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ కమిషనరేట్లో సీపీ అంజనీకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..యాకత్పురకు చెందిన సయ్యద్ నవీద్ అలియాస్ ఫైసల్ బషీర్బాగ్లోని బాబుఖాన్ ఎస్టేట్ ఏడో అంతస్తులో క్యూబెజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. గౌలిపురాకు చెందిన సయ్యద్ ఓవైస్ డీటీపీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. సయ్యద్ నవీద్కు తన వ్యాపారంలో వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టిఫికెట్లతో పాటు ప్రైవేటు ఉద్యోగుల జీతాల పే స్లిప్లు, తెలంగాణ యూనివర్సిటీకి చెందిన బీకాం, ఆంధ్రా యూనివర్సిటీ బీటెక్, మహారాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లను తయారు చేయడం ప్రారంభించాడు. సయ్యద్ ఓవైస్ డీటీపీ వర్క్లో నైపుణ్యం ఉండటంతో అతడు ఫొటో షాప్లో ఎడిట్ ఆప్షన్ను ఉపయోగించి.. అసలు సర్టిఫికెట్ల మాదిరిగా మార్చుతున్నాడు.
ఈ సర్టిఫికెట్లతో ఎమ్మెస్సీ..
సయ్యద్ తన కన్సల్టెన్సీ ద్వారా ఎమ్మెస్సీ కోసం విదేశాలకు పంపిస్తానని యూకేలోని టీసైడ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బ్లాక్ పూల్, యూనివర్సిటీ ఆఫ్ లా, హారియట్ట్వాట్-స్కాట్ల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ షిల్లర్-యూఎస్ఏ, యూనివర్సిటీ ఆఫ్ కాన్కోర్డియా-యూఎస్ఏ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా విదేశాల్లో ఎమ్మెస్సీ చదువు కోసం పంపుతానని.. నవీద్ నకిలీ సర్టిఫికెట్లను రూపొందించి వాటి ద్వారా చాలా మందిని అమెరికా, యూకే, స్కాట్ల్యాండ్కు పంపాడు. అలా విద్యార్థులను పంపడంతో ఆయా యూనివర్సిటీల నుంచి కమీషన్లు తీసుకుంటూ.. నవీద్ దందాను జోరుగా నడిపిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా దుబాయ్లోని సంస్థల్లో పని చేస్తున్న కొందరికి పదోన్నతికి అవసరమయ్యే పత్రాలను తయారు చేసి.. వారి నుంచి భారీగా డబ్బులను గుంజుతున్నాడు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.