న్యూఢిల్లీ: నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ను పేల్చేందుకు అంతా సిద్ధం చేశారు. అక్రమంగా నిర్మించిన అపెక్స్, సియాన్ బిల్డింగ్లను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కూల్చనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు ఈ టవర్స్ను పేల్చనున్నారు. అయితే పేల్చివేత కోసం ఆ రెండు బిల్డింగ్లలో సుమారు 3700 కిలోల పేలుడు పదార్ధాలను అమర్చారు. పేలుడు పదార్ధాలతో లింకు ఉన్న ఎక్స్ప్లోడర్ బటన్ను ఆ టవర్స్కు సుమారు వంద మీటర్ల దూరంలో ఉంచారు. వంద మీటర్ల దూరం నుంచే పేల్చివేత బటన్ను నొక్కనున్నారు. రెండు టవర్స్ కూడా వంద మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న విషయం తెలిసిందే.
పేల్చివేతకు ముందు ఎమరాల్డ్ కోర్టు పరిసరాల్లో ఉన్న అయిదు వేల మంది నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. పక్కనే ఉన్న ఏటీఎస్ విలేజ్ సొసైటీలను కూడా ఖాళీ చేయించనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల వరకే అందర్నీ ఖాళీ చేయిస్తారు. అక్కడ ఉన్న సుమారు మూడు వేల వాహనాలను కూడా తరలిస్తారు. ఇక సమీప ఇండ్లల్లో ఉన్న దాదాపు 200 పెంపుడు జంతువుల్ని కూడా తరలిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే మధ్యాహ్నం 2.30 నిమిషాలకు పేల్చివేత ఉంటుందని ఎడిఫైస్ ఇంజినీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ మయూర్ మెహతా తెలిపారు.
ట్విన్ టవర్స్ వద్ద ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇక డ్యూటీలో ఆ ప్రాంతంలో సుమారు 400 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తారు. ఆరు అంబులెన్సులు రెడీగా ఉన్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునిల్ శర్మ తెలిపారు. వాటర్ఫాల్ ఇంప్లోజన్ టెక్నాలజీ విధానంలో టవర్స్ను పేల్చనున్నారు. ఈ పద్ధతిలో పేల్చడం వల్ల ఆ టవర్స్ పేకమేడల్లా కూలిపోనున్నాయి. కేవలం 9 సెకన్లలోపే ఆ బిల్డింగ్లు ధ్వంసం అవుతాయి. దాదాపు 80 వేల టన్నుల శిథిలాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ శిథిలాలను తొలగించేందుకు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది.