హైదరాబాద్ : తెలంగాణలో సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఇరిగేషన్ పద్దులపై దివాకర్ రావు మాట్లాడారు. గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని పట్టించుకోలేదన్నారు. టీడీపీ హయాంలో 10 సంవత్సరాల్లో రూ. 10 వేల కోట్లు, కాంగ్రెస్ హయాంలో రూ. 55 వేల కోట్లు ఖర్చు పెడితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నరేండ్లలో రూ. లక్షా 55 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఈ బడ్జెట్ను చూస్తుంటే.. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అర్థమవుతుందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 24 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే.. ఇప్పుడు అది 64 లక్షల టన్నులకు చేరిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి చివరి ఎకరా వరకు సాగునీరు అందిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటలు సరియైనవి కావు అన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని దివాకర్ రావు మండిపడ్డారు.