యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : పోతరాజుల విన్యాసాలు.. లంబాడాల నృత్యాలు.. బోనాలు.. రంగురంగుల బతుకమ్మలు.. డప్పు మోతలు.. డీజే చప్పుళ్లతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నేతృత్వంలో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సమ్మేళనానికి మండలంలోని అన్ని గ్రామాలు, తండాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బైకులు, ఆటోలు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లల్లో భారీ సంఖ్యలో కదిలివచ్చారు. తండాలతోపాటు ఇతర గ్రామాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నారాయణపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సమ్మేళనంలో ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకొని తెలంగాణ ఉద్యమం నాటి ముచ్చట్లు చెప్పుకొన్నారు. సామూహిక భోజనాలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి సుమారు 12 వేల మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులు హాజరైనట్టు అంచనా వేస్తున్నారు. అంచనా వేసినదానికంటే అధికంగా తరలివచ్చారని టీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు.
చిందేసిన ఎమ్మెల్యేలు
ఆత్మీయ సమ్మేళనంలో ధూంధాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం చిందేశారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోలాటలు ఆడారు. అందరితో కలిసి డ్యాన్స్లు చేశారు. అంతకుముందు ర్యాలీలో గాదరి కిశోర్ చేసిన కర్రసాము విన్యాసం అందరినీ ఆకట్టుకున్నది.
మోదీ, షా కుట్రతోనే ఉపఎన్నిక:
ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్రెడ్డి
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దుష్టద్వయం కుట్రతోనే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి దేశ రాజకీయాలను శాసిస్తారనే భయంతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపారని విమర్శించారు. దుష్ట ద్వయం చెంతన చేరి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి 25 వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుపోయాడని ధ్వజమెత్తారు. ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ పథకాలను దేశమంతా అమలు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుండటంతో దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ఉప ఎన్నికల ప్రహసనాన్ని సృష్టించిందని మండిపడ్డారు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారని, దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. బీజేపీపై పోరుకు మునుగోడులో 70 వేల మంది గులాబీ సైనికులు సిద్ధంగా ఉన్నారని, ఇక్కడ కమలం పార్టీ కుట్రలకు తావులేదని తేల్చిచెప్పారు. ప్రజలు బీజేపీకి కర్రుకాల్చి వాత పెట్టాలని, టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని మంత్రి పిలుపునిచ్చారు.