చౌటుప్పల్ నుంచి గుడిమల్కాపురం వరకు డబుల్ రోడ్డు
రూ.1.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
జోరుగా సాగుతున్న పనులు
చౌటుప్పల్ రూరల్, నవంబర్ 24 : ఇరుకు రోడ్డు.. ఆపై గుంతలతో ప్రయాణికులు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. చౌటుప్పల్ నుంచి సంస్థాన్నారాయణపురం మండలం గుడిమల్కాపురం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10కోట్లు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. దాంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేండ్ల క్రితమే నిధులు
చౌటుప్పల్ నుంచి మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి వెళ్లే ఈ ప్రధాన రహదారి 4.8 కిలోమిటర్ల మేర గుంతల మయంగా మారింది. చౌటుప్పల్ పట్టణ కేంద్రం గుండా వెళ్లే 65వ జాతీయ రహదారి నుంచి ప్రారంభమయ్యే రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. 5 కిలోమీటర్లు వెళ్లాలంటే నరకం కనిపించేంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విషయాన్ని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి రోడ్డు నిర్మాణపనులకు నాలుగేండ్ల క్రితమే నిధులు మంజూరు చేయించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేయక పోవడంతో ఆ టెండర్లను రద్దు చేసి మరొకరికి పనులు అప్పగించారు. దీంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.
రోడ్డు నిర్మాణం ఇలా..
కొత్తగా వేసే రోడ్డుకు కొన్ని సవరణలు చేశారు. చౌటుప్పల్ వద్ద 65వ జాతీయరహదారి నుంచి 200 మీటర్లు సీసీరోడ్డు, తర్వాత 1.2 కిలోమీటర్లు నాలుగులేన్ల రోడ్డును నిర్మిస్తారు. ఇందుకోసం గతంలో మంజూరు చేసిన నిధులు కాకుండా అదనపు నిధుల కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మిగతా 3.4 కిలోమీటర్ల డబుల్ రోడ్డు నిర్మాణం గతంలో చేసిన ప్రతిపాదన ప్రకారమే నిర్మిస్తున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పాత రోడ్డును తవ్వి కొత్తగా రోడ్డు వేసే పనులు చేపడుతున్నారు. ఆయా పనులు అధికారుల పర్యవేక్షణలో జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు తీరుతాయి
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం వల్ల మా ప్రయాణ కష్టాలు తీరుతాయి. గుంతలు పడ్డ రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులు పడ్డాం. 5 నిమిషాల ప్రయాణానికి అరగంటకు పైగా పడుతున్నది. రోడ్డు బాగాలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుకోసం నిధులు మంజూరు చేయించిన మంత్రి జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డికి కృతజ్ఞతలు.
-కొయ్యడ గాలయ్య గౌడ్, తంగడపల్లి, చౌటుప్పల్