హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 3న హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ అధ్యక్షుడు హనుమంత్రావు, ప్రధానకార్యదర్శి మల్కాపురం శివకుమార్ తెలిపారు.
బసవేశ్వరుడి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నదని కొనియాడారు. వీరశైవ లింగాయత్ సామాజిక వర్గం అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నదని వారు చెప్పారు. ఇప్పటికే వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.10 కోట్ల విలువైన ఎకరం స్థలాన్ని కేటాయించి, రూ.కోటి నిధులను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ వేడుకలకు వీరశైవ లింగాయత్ కులబాంధవులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.