‘పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే’ ‘పుష్ప అంటే ఫ్లవరనుకుంటివా.. ఫైర్’ ఇప్పుడు ఈ డైలాగులు తెలుగు సినిమా సత్తాను చాటుతున్నాయి. ‘పుష్ప’ సినిమా రిలీజై నెల దాటిపోయినా, ఆ చిత్రంలోని మాటలు, పాటలు ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ గల్లీలోని పిల్లలు మొదలు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు.. అందరూ బన్ని డైలాగులకు వంతపాడుతున్నారు. శ్రీవల్లి స్టెప్పులకు స్లిప్ అయిపోతున్నారు. ‘పుష్ప’ విషయంలోనే కాదు, టాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు ఉత్తరాదిలో ఊహించనంత క్రేజ్ వస్తున్నదని ప్రముఖ మ్యాగజైన్ ‘ఓపెన్’ ఓ కథనాన్ని ప్రచురించడం విశేషం.
మొన్నటికి మొన్న ముంబయిలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. తెలుగు సినిమా స్థాయి ఎంత పెరిగిందో చెప్పింది. వేదికపై తెలుగు హీరోలు రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ల ఎంట్రీ, రాజమౌళికి వచ్చిన స్పందన చూడటానికి రెండు కండ్లు సరిపోవు.
తాజాగా పుష్ప.. ఆఖరి నిమిషంలో పాన్ ఇండియాగా రూపాంతరం చెందిన ఈ సినిమాకు బాలీవుడ్ అభిమానులు సైతం బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్ల వర్షం కురిపించారు. దాదాపు రూ.85 కోట్లు వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసిందీ చిత్రం. అంతకుమించి టాలీవుడ్ సినిమాలపై క్రేజ్ను పెంచింది.
దేశంలోనే రెండో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. సినిమాలు, కలెక్షన్ల పరంగా ఇంట ఎప్పుడో గెలిచినా.. రచ్చ గెలిచింది మాత్రం రాజమౌళి ‘బాహుబలి’తోనే అన్నది వాస్తవం. రెండు భాగాలుగా విడుదలైన బాహుబలితో రాజమౌళి తెలుగు సినిమా రేంజ్ను అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్తో మరోసారి యావద్భారతం తెలుగు సినిమావైపు చూసేలా చేశాడు. కొవిడ్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడటంతో ట్రిపుల్ ఆర్ మానియాకు కామా పడ్డట్టయింది. కానీ, ఈ గ్యాప్లో అల్లు అర్జున్ ‘పుష్ప’ హిందీ మూవీ ఇండస్ట్రీని దున్నేసింది. బన్ని యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ బాలీవుడ్ భక్తులకు టాలీవుడ్ కిక్ ఎక్కిచ్చింది.
డబ్బింగ్ చిత్రాల ప్రభావం
ప్రభాస్, రామ్చరణ్, అల్లు అర్జున్, మహేశ్బాబు ఇలా నవతరం నటులకు దక్షిణాదిలో మంచి క్రేజే ఉంది. కేరళలో అయితే అల్లు అర్జున్కు ఇక్కడున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లోని మారుమూల పల్లెల్లోనూ ఈ నటులకు అభిమాన గణం ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అందుకు కారణం ఈ హీరోల డబ్బింగ్ చిత్రాలు టీవీలో ప్రసారం కావడమే! శక్తి, అశోక్, యమదొంగ తదితర చిత్రాల డబ్బింగ్ వెర్షన్లు మూవీ చానెల్స్లో ప్రసారం కావడంతో రూరల్ ఇండియాలో జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. మిగతా హీరోల సినిమాలు సైతం హిందీ డబ్బింగ్తో అక్కడి ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి. ఫలితంగా ఆయా హీరోలకు ఫ్యాన్ బేస్ పెరిగింది. దీనికి తోడు పాన్ ఇండియా సినిమా సంస్కృతి మొదలవడంతో టాలీవుడ్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది.
వరుసలో మరిన్ని..
బాహుబలితో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ప్రభాస్ తన గ్రాఫ్ను అలాగే కొనసాగిస్తున్నాడు. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘రాధేశ్యామ్’ బహుభాషా చిత్రంగా పలకరించనుంది. రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’లో రాముడి పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. ‘సలార్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా కూడా పాన్ ఇండియాగా రూపొందుతున్నవే కావడం విశేషం. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం బాలీవుడ్పై కన్నేశాడు. పూరీ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ‘లైగర్’ పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అడవి శేషు ‘మేజర్’, శంకర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న రామ్చరణ్ సినిమా కూడా పాన్ ఇండియా చిత్రాలుగా పలకరించనున్నాయి. రానున్న రోజుల్లో ఈ జాబితాలో పదుల సంఖ్యలో సినిమాలు చేరనున్నాయి. మొత్తానికి సక్సెస్ఫుల్ సినిమా అంటే కేరాఫ్ టాలీవుడ్ అంటున్నారు విశ్లేషకులు. తెలుగు ప్రేక్షకులుగా ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగాలని కోరుకుందాం!
‘రాజస్థాన్ నుంచి ‘బంగార్రాజు’ సినిమా ఇరవై ప్రింట్లు కావాలని అడిగారు. వాళ్లు ఎందుకు అడిగారో నాకు అర్థం కాలేదు’ ఇటీవల ఒక వేదికపై హీరో నాగార్జున పంచుకున్న మాటలివి. బంగార్రాజు హిందీలోకి డబ్బింగ్ కూడా చేయలేదు. అయినా, తెలుగు సినిమా ప్రింట్లు కావాలని రాజస్థాన్ నుంచి అభ్యర్థనలు రావడం ఆశ్చర్యమే!