టోక్యో : ప్రేక్షకులు లేకుండా టోక్యో ఒలింపిక్స్ జరుగనున్నాయి. జపాన్లో కొవిడ్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా ఒలింపిక్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడలు జరిగే ప్రాంతాల్లో అత్యయిక పరిస్థితి విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తమయో మారుకావా గురువారం తెలిపారు. ప్రభుత్వ అధికారులు, ఒలింపిక్, పారాలింపిక్ ముఖ్యులు, నిర్వాహకులతో చర్చలు జరిపిన అనంతరం తమయో మారుకావా విషయాన్ని ప్రకటించారు.
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో నిపుణులు, ప్రభుత్వ అధికారులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి ఆగస్ట్ 22వ తేదీ వరకు జపాన్లో అత్యవసర పరిస్థితిని విధించాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు జరుగాల్సి ఉంది. ఒలింపిక్ క్రీడలు గతేడాది జరుగాల్సి ఉండగా.. సంవత్సరం పాటు వాయిదా వేశారు.
ఒలింపిక్ క్రీడల కారణంగా జపాన్ ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ ప్రెసిడెంట్ హసిమోటో మాట్లాడుతూ పరిస్థితి విచారకరమని, టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు డబ్బులు రీఫండ్ చేసేందుకు కమిటీ ఆలోచిస్తుందన్నారు. ఇంతకు ముందే టోక్యోలో ఇతర దేశాల నుంచి అభిమానులు రాకుండా నిషేధం విధించారు.
కేవలం జపనీయులకు మాత్రమే పోటీలను వీక్షించేందుకు అనుమతి ఇచ్చారు. డాక్టర్ షిగెరు ఓమి నేతృత్వంలోని 26 మంది వైద్య నిపుణుల బృందం క్రీడలకు అభిమానులను అనుమతించడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. ప్రేక్షకులు లేకుండా టోర్నీ నిర్వహించాలని సలహా ఇచ్చింది.