హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 25: ఆపదలో ఉన్నవారికి నాటి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొండిచెయ్యి చూపించగా.. నేడు అదే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తన్నీరు హరీశ్రావు అండగా నిలుస్తున్నారు. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి రూ.12 లక్షలు ఖర్చవ్వగా, తల్లిదండ్రుల విజ్ఞప్తితో అప్పటి మంత్రి ఈటల రాజేందర్ సీఎంఆర్ఎఫ్ కింద రూ.60 వేలు ఇప్పించి చేతులు దులుపుకొన్నారు. అప్పులు తెచ్చి బిడ్డకు వైద్యం చేయించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో మంత్రి హరీశ్రావును కలిసి గోడు వెల్ల్లబోసుకొన్నారు. భరోసా ఇచ్చిన హరీశ్రావు రూ.4.40 లక్షలు ఇప్పించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన జాహెద్ నవాజ్ పదేండ్ల కూతురు మహ్విష్ ఫాతిమా వినికిడి లోపంతో జన్మించింది. రూ.12 లక్షలు అప్పులు తెచ్చి 2019లో ఆమెకు శస్త్రచికిత్స చేయించారు. అయినా, పాపకు నయంకాకపోగా మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో అప్పటికే ఖర్చుచేసిన రూ.12 లక్షల బిల్లులతో ఈటల క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వీళ్ల గోస పట్టించుకోని ఈటల.. కేవలం రూ.60 వేలు మంజూరు చేయించారు. పేద కుటుంబానికి చెందిన తాము అంత ఖర్చు చేసి ఆపరేషన్ చేయిస్తే చాలా తక్కువగా సీఎంఆర్ఎఫ్ ఇప్పించారన్న ఆవేదనతో చెక్కును వాపస్ ఇచ్చారు. తర్వాత 17వ వార్డు కౌన్సిలర్ ఉజ్మానూరిన్ భర్త మహ్మద్ ఇమ్రాన్ సాయంతో నవాజ్ సోదరుడు అమెర్ గతేడాది సిద్దిపేటకు వెళ్లి మంత్రి హరీశ్రావును కలిసి తమ బాధను చెప్పుకొన్నారు. స్పందించిన మంత్రి బాలికకు మళ్లీ ఆపరేషన్ చేయించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.4.40 లక్షల చెకును ఇటీవల అందించి కుటుంబానికి అండగా నిలిచారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు.