మహిళల వన్డే ప్రపంచకప్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఘన విజయంతో మెగాటోర్నీలో అదిరిపోయే బోణీ కొట్టిన భారత్..మలి మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్తో పోరుకు సై అంటున్నది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఎదురైన ఓటమికి కసితీరా ప్రతీకారం తీర్చుకోవాలని మిథాలీసేన పట్టుదలతో కనిపిస్తుంటే..కివీస్ తమ జోరు కొనసాగించేందుకు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశముంది.
హామిల్టన్: వన్డే ప్రపంచకప్లో భారత్, న్యూజిలాండ్ జట్లు కదనరంగంలోకి దిగనున్నాయి. గురువారం హామిల్టన్ సెడాన్పార్క్లో ఇరు జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో శుభారంభం చేసిన మిథాలీరాజ్ నేతృత్వంలోని టీమ్ఇండియా..సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ చెలరేగాలనుకుంటున్న కివీస్కు దీటైన పోటీనివ్వాలని చూస్తున్నది. మెగాటోర్నీకి ముందు తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం కోసం మన అమ్మాయిలు ఎదురుచూస్తున్నారు. పాక్తో తొలి మ్యాచ్లో టాపార్డర్ విఫలమైనా..లోయార్డర్లో దీప్తిశర్మ, స్నేహ్ రాణా, పూజ వస్ర్తాకర్ రాణించడంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్కు మంచి అనుకూలమైన హామిల్టన్లో భారీ స్కోరు సాధించి కివీస్ను కట్టడి చేయాలన్న తలంపుతో టీమ్ఇండియా కనిపిస్తున్నది. అయితే బ్యాటింగ్లో నిలకడలేమి సమస్య భారత్ను వెంటాడుతున్నది. ముఖ్యంగా డాషింగ్ బ్యాటర్ షెఫాలీవర్మ ఫామ్లేమి జట్టును ఇబ్బంది పెడుతున్నది. ఓవైపు స్మృతి మందన విజృంభిస్తుంటే..ఆమెకు సరైన సహకారం అందించడంలో మిగతావాళ్లు విఫలమవుతున్నారు. గత ఏడు మ్యాచ్ల్లో అర్ధసెంచరీ మినహా షెఫాలీ చెప్పుకోదగ్గ స్కోర్లు ఏమి చేయలేదు. అయితే కివీస్తో మ్యాచ్ సందర్భంగా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి వర్చువల్ మీడియా భేటీలో మాట్లాడుతూ ‘షెఫాలీ మళ్లీ పుంజుకుంటుంది. నెట్స్లో ఆమె బాగా ప్రాక్టీస్ చేస్తుంది. భారీ ఇన్నింగ్స్ ద్వారా ఆమె మళ్లీ ఫామ్లోకి వస్తుందన్న నమ్మకముంది. కివీస్తో మ్యాచ్ ద్వారా టచ్లోకి వస్తే భారత్కు లాభించినట్లే’ అని అంది. బౌలింగ్ విషయానికొస్తే..పాక్తో మ్యాచ్లో గోస్వామి మినహా ఎవరూ రాణించలేకపోయారు.
కివీస్ పడుతూ లేస్తూ: సొంతగడ్డపై జరుగుతున్న మెగాటోర్నీలో న్యూజిలాండ్ పయనం పడుతూ లేస్తూ సాగుతున్నది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన కివీస్..రెండో మ్యాచ్లో బంగ్లాను చిత్తుచేసింది. మిగిలిన మ్యాచ్ల్లో తప్పక గెలిస్తేనే సెమీస్ బెర్తు దక్కించుకునే అవకాశమున్న నేపథ్యంలో భారత్తో మ్యాచ్ను న్యూజిలాండ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.