న్యూఢిల్లీ : ప్రస్తుతం జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఒక్క పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే దఫా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈసారి ఏ రాష్ట్రంలో ఎవరిది అధికారం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ-సీ ఓటర్ సంస్థ తాము నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది.
టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వే ఫలితాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నది. అయితే, స్వల్ప ఆధిక్యంతో మమతా బెనర్జీ తిరిగి అధికారం నిలబెట్టుకోనున్నది. మరోవైపు తమిళనాడులో డీఎంకే-లెఫ్ట్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక అసోంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ.. ఎన్డీఏ కూటమికే అధికారం దక్కనున్నది. ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చురిలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని సర్వే వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు విజయం అంత ఈజీ కాదని తెలుస్తున్నది. ఇక్కడ దీదీ అతి కష్టం మీద అధికారం నిలబెట్టుకుంటారని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో 2016 ఎన్నికల్లో గెలుపొందిన 211 స్థానాలకన్నా కొన్ని తక్కువగా ఈసారి సాధిస్తుందని తెలిపింది. గత ఎన్నికల్లో మూడు స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈసారి వందకు పైగా స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. వామపక్షాలు-కాంగ్రెస్ కూటమి 33 సీట్లకే పరిమితం కానున్నదని సర్వే స్పష్టం చేసింది.
తమిళనాడు రాజకీయాల్లో ప్రజలు స్పష్టమైన మార్పును కోరుకుంటున్నట్లు సర్వే తేల్చింది. ఇక్కడ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని తెలిపింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి పట్టుమని 65 స్థానాలు రావడం కూడా కష్టమే అని సర్వే పేర్కొన్నది. గత ఎన్నికల్లో డీఎంకే-కాగ్రెస్ కూటమికి 98 సీట్లు రాగా.. ఈసారి 158 స్థానాల్లో విజయదుందుభి మోగించడం ఖాయమన్నది. ఇక కేరళ విషయానికొస్తే, అక్కడ తిరిగి మార్స్కిస్టులే అధికారంలోకి వస్తారని సర్వే స్పష్టం చేస్తున్నది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఈసారి 82 సీట్లు సాధించి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పుంజుకుని 56 సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొన్నది. ఇక బీజేపీ గతంలో మాదిరిగా ఒక్కసీటుకే పరిమితం కానున్నదని సర్వే పేర్కొన్నది.
అసోం అసెంబ్లీలో ఉన్న 126 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ-యూపీఏ కూటమి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నది. ఎవరికి వారు తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 67 సీట్లలో గెలిచి అధికారంలోకి తిరిగి వస్తుందని తెలిపింది. యూపీఏ కూటమికి 10 సీట్లు తక్కువగా వచ్చాయని పేర్కొన్నది. అదేవిధంగా 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఈసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని సర్వే తెలిపింది. ఎన్డీఏకు 18 సీట్లు వస్తుండగా.. యూపీఏకు 12 స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఈ నెల 27 న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2 న ఓట్ల లెక్కింపు చేపడతారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.